టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన రాజశేఖర్ కోసం ఆయన భార్య సుచరిత తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. మరి పిటిషన్ లో ఏం పేర్కొన్నారు? హైకోర్టు ఏమన్నది?
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో రాజశేఖర్, రేణుక, ప్రవీణ్ లు ప్రధాన నిందితులుగా ఉన్న సంగతి తెలిసిందే. వీరిని పోలీసులు తమ కస్టడీలోకి తీసుకుని విడివిడిగా విచారిస్తున్నారు. అయితే రాజశేఖర్ కోసం అతని భార్య సుచరిత హైకోర్టులో పిటిషన్ వేశారు. తన భర్తపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారని ఆమె ఆరోపించారు. తన భర్తకు వైద్య పరీక్షలు నిర్వహించాలని, పేపర్ లీకేజ్ కేసును సీబీఐకి అప్పగించాలని ఆమె హైకోర్టును కోరారు. ఈ మేరకు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసును సీబీఐతో విచారణ జరిపించేలా ఆదేశాలు ఇవ్వాలని.. అలానే తన భర్తపై థర్డ్ డిగ్రీ ప్రయోగించకుండా ఆదేశాలు ఇవ్వాలని ఆమె కోరారు. తన భర్తను అంతేకాదు ఇప్పటివరకూ జరిపిన విచారణను వీడియోలో చూపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. డీజీపీ, చీఫ్ సెక్రటరీ, సిట్, హైదరాబాద్ సిటీ డీసీపీ సెంట్రల్ జోన్లను ప్రతివాదులుగా పేర్కొన్నారు.
అయితే సుచరిత వేసిన పిటిషన్ ను విచారించిన హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. అభ్యంతరాలు ఉంటే నాంపల్లి కోర్టును ఆశ్రయించాలని హైకోర్టు ధర్మాసనం సూచించింది. పేపర్ లీకేజ్ కేసు విచారణ సందర్భంగా ప్రొసీజర్ ఫాలో అవుతున్నామని ప్రభుత్వ తరపు న్యాయవాది వెల్లడించారు. హైకోర్టు తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. మరోవైపు పేపర్ లీకేజ్ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని కాంగ్రెస్ నేత బల్మూరు వెంకట్ కూడా హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసులో మంత్రి కేటీఆర్ పీఏ తిరుపతి పాత్రపై దర్యాప్తు జరిపించాలని హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ఈయనతో పాటు మరో ఇద్దరు అభ్యర్థులు పిటిషన్ వేశారు.
గ్రూప్-1 పరీక్షల్లో ఒకే జిల్లాకు చెందిన 20 మందికి అధిక మార్కులు రావడంపై అనుమానంగా ఉందని, ఇటీవల మీడియా సమావేశంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కూడా అనుమానం కలిగేలా ఉన్నాయని అన్నారు. పేపర్ లీకేజ్ వ్యవహారంలో ఇద్దరి పాత్ర మాత్రమే ఉందంటూ కేటీఆర్ విచారణను తప్పు దోవ పట్టించారని బల్మూర్ వెంకట్ పిటిషన్ లో పేర్కొన్నారు. సిట్ దర్యాప్తును ప్రభుత్వం ప్రభావితం చేస్తుందన్న అనుమానాలు ఉన్నాయని ఆరోపించారు. కాగా బల్మూర్ వెంకట్ తరపున నేషనల్ కాంగ్రెస్ లీగల్ సెల్ ప్రెసిడెంట్ వివేక్ ధన్కా తెలంగాణ హైకోర్టులో మార్చి 21న వాదనలు వినిపించనున్నారు. ఈ పిటిషన్ పై హైకోర్టు మంగళవారం విచారణ జరపనుంది. కాగా ఈ కేసులో నిరుద్యోగులు వేసిన పిటిషన్ ను హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. మరి రాజశేఖర్ పై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారని.. ప్రయోగించకుండా ఆదేశాలు జారీ చేయమని రాజశేఖర్ భార్య సుచరిత కోర్టులో పిటిషన్ వేయడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.