దేశంలో కరోనా ఒమిక్రాన్ వేరియంట్ దడ పుట్టిస్తోంది. ఎన్ని నియంత్రణ చర్యలు తీసుకుంటున్నా రోజురోజుకీ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య 361కి చేరుకుంది. ఢిల్లీ 67, తెలంగాణ 38 కేసులతో రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. తెలంగాణలో నమోదవుతున్న కేసుల్లో ఎక్కువగా విదేశాల నుంచి వచ్చే వారికే ఒమిక్రాన్ పాజిటివ్ వస్తోంది. ఒమిక్రాన్ కట్టడికి తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు. హైదరాబాదులో 30కి పైగా బస్తీ దవాఖానాలు ప్రారంభమయ్యాయి.
ఈ సందర్భంగా రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ బస్తీ దవాఖానాలను మున్సిపాలిటీలకు కూడా విస్తరిస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతోందని హరీశ్ తెలిపారు. ఒమిక్రాన్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నప్పటికీ, దాని తీవ్రత మాత్రం తక్కువేనని చెప్పారు. కరోనా థర్డ్ వేవ్ వచ్చినా తట్టుకునే విధంగా అన్ని చర్యలను తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటికే హైదరాబాదులో 1,400 పడకలను ఏర్పాటు చేశామని… నీలోఫర్ ఆసుపత్రిలో 800 పడకలు, మరో 6 ఆసుపత్రుల్లో 100 బెడ్స్ చొప్పున ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 24 లక్షల హోమ్ ఐసొలేషన్ కిట్లను రెడీగా ఉంచామని అన్నారు.
ఇది కూడా చదవండి : తెలంగాణలో సినిమా టికెట్ల రేట్లు నిర్ణయిస్తూ ప్రభుత్వం జీవో
ప్రతి ఒక్కరూ రెండు డోసుల వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించుకోవాలని చెప్పారు. కోవిడ్ లక్షణాలు ఏమాత్రం కనిపించినా వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి వేడుకల సందర్భంగా జనం పెద్ద ఎత్తున గుమికూడకుండా ఆంక్షలు విధించాలన్న హైకోర్టు ఆదేశాలపై స్పందిస్తూ… హైకోర్టు ఆదేశాలను గౌరవిస్తామని తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.