సాధారణంగా ఎప్పుడైనా ఆరోగ్యం బాగాలేక.. రెండు మూడు రోజులు అన్నం తినకపోతేనే ఏదోలా అనిపిస్తుంది. నోరు చచ్చుబడిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. అలాంటిది ఏళ్ల తరబడి అన్నం తినకుండా ఉండటం అంటే మాములు విషయం కాదు. కానీ ఓ వృద్ధురాలు మాత్రం.. గత 30 ఏళ్ల నుంచి అన్నం ముట్టలేదు. కేవలం చాయ్ తాగుతూ.. కాలం వెళ్లదీస్తోంది. ఇంతకు ఎవరా వృద్ధురాలు.. ఏమా కథ అంటే..
నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం దామెర భీమనపల్లి గ్రామానికి చెందిన సుగుణమ్మకు (60) కుమారుడు, కుమార్తె ఇద్దరు సంతానం. కొన్నేళ్ల క్రితం భర్త మృతి చెందాడు. ఇక సుగుణమ్మకు 30 ఏళ్ల వయసున్నప్పుడు.. కడుపు నొప్పి రావడంతో.. వైద్యులు శస్త్ర చికిత్స చేశారు. ఆపరేషన్ అనంతరం అన్నం తింటే జీర్ణం కాక.. వాంతులయ్యాయి. అప్పటి నుంచి ఆమెకు అన్నం మీదనే విరక్తి కలిగింది. ఈ క్రమంలో అన్నం బదులు.. చాయ్ తాగడం ప్రారంభించింది. క్రమేణా అదే అలవాటుగా మార్చుకున్న సుగుణమ్మ.. ఇప్పటికీ.. దాన్నే కొనసాగిస్తోంది.
ఈ క్రమంలో సుగుణమ్మ రోజు మొత్తానికి సరిపడా చాయ్ చేసుకుని.. ఒకేసారి ప్లాస్క్ లో నింపుకుంటుంది. ఆకలేసినప్పుడల్లా.. చాయ్ తాగుతూ.. కడుపు నింపుకుంటుంది. అప్పడప్పుడు చాయ్ లో మరమరాలు వేసుకుంటుంది. 30 ఏళ్ల నుంచి ఇదే అలవాటు కొనసాగిస్తున్నప్పటికి.. తనకు ఇంత వరకు ఎలాంటి సమస్య తలెత్తలేదని చెబుతోంది సుగుణమ్మ. వృద్ధురాలి వింత అలవాటుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.