”దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే నిర్మితమై ఉంది” అన్న మాట అక్షరాల నిజం. మరి అలాంటి తరగతి గదులు సమస్యలకు నిలయాలుగా మారితే.. దేశ భవిష్యత్ ను మార్చే రేపటి యువత.. ఆ సమస్యల సుడిగుండాల్లో కొట్టుకుపోతుంటే ఇంకెక్కడి అభివృద్ధి సాధ్యం అవుతుంది. ఇప్పటికీ పలు రాష్ట్రాల్లోని స్కూల్లలో అనేక సమస్యలు తిష్టవేసి కూర్చున్నాయి. తాజాగా మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలోని మైలారం హైస్కూల్ లో విద్యార్థినులు ఎదుర్కొంటున్న సమస్య తెలిస్తే మనసు కదిలిపోతుంది. ఎక్కడ బాత్రుంకు వెళ్లాల్సి వస్తుందో అని నీళ్లు తాగడమే మానేశారు అక్కడి స్టూడెంట్స్. ఈ సమస్యపై బుధవారం స్కూల్ మేనేజ్మెంట్ చైర్మన్ ఇంటిని ముట్టడించారు విద్యార్థినిలు. ఈ సంఘటన గురించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
అది మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలోని మైలారంలో హైస్కూల్ ఉంది. ఈ పాఠశాలలో మెుత్తం 207 మంది విద్యార్థులు ఉన్నారు. వారిల్లో 100 మంది దాక బాలికలు ఉన్నారు. ఇక గత ఎండాకాలంలో నూతనంగా టాయిలెట్స్ కడతామని చెప్పి ఉన్న పాత బాత్రుం లను పడగొట్టారు. అనంతరం కొత్త బాత్రుంలకు శంకుస్థాపన చేసి నెలలు గడుస్తున్నాగానీ ఇప్పటికీ పనులు ప్రారంభించలేదని విద్యార్థులు వాపోయారు. టాయిలెట్స్ లేకపోవడంతో మేం నీళ్లు కూడా తాగట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే బుధవారం స్కూల్ మేనేజ్ మెంట్ ఛైర్మన్ భాస్కర్ ఇంటిని ముట్టడించారు విద్యార్థులు. టాయిలెట్స్ కట్టించే వరకు ధర్నా చేస్తామని వారు తెలిపారు. దాంతో ఛైర్మన్ స్పందిస్తూ.. సమస్యను వెంటనే పరిష్కరిస్తామని విద్యార్థినిలకు నచ్చచెప్పి స్కూల్ కు తీసుకెళ్లాడు. మరికొన్ని రోజుల్లో మా సమస్యను పరిష్కరించకపోతే గ్రామపంచాయతీ ముందు ధర్నా చేస్తామని స్టూడెంట్స్ హెచ్చరించారు. అనంతరం ఛైర్మన్ కు వినతి పత్రం ఇచ్చి పాఠశాలకు వెళ్లిపోయారు.