ఎన్నికల ముందు ప్రజల వద్దకు వచ్చి మీ కష్టాలు తీరుస్తా.. నన్ను గెలిపించడండి అంటూ నేతలు ఎన్నో వాగ్దానాలు చేస్తుంటారు. ఇక గెలిచిన తర్వాత అటు ముఖం కూడా చూపించని నేతలను ఎంతో మందిని చూస్తుంటాం. కానీ.. కొంత మంది రాజకీయ నేతలు మాత్రం కష్టాల్లో ఉన్నవారిని ఆదుకుంటూ తమ వాగ్దానాలు నిలబెట్టుకుంటారు. ఓ చిన్నారి తెలంగాణ మంత్రి వద్దకు వచ్చి దీనంగా నన్ను చదవించండి సార్ అని అడగడంతో ఆయన చలించిపోయారు. చదువుపై ఉన్న శ్రద్ద ఆయనను కదిలించింది. ఈ ఘటన మహబూబ్ నగర్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే..
పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదివారం మైసమ్మ దేవాలయానికి పూజలు చేయడానికి వచ్చారు. నవాబ్ పేటకు చెందిన మల్లెల బుజ్జమ్మ, వెంకటేశ్ దంపతులు ఒక చిన్న రేకుల గదిలో ఉంటూ అక్కడే కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్, చిప్స్ లాంటివి అమ్ముకుంటు జీవిస్తున్నారు. వీరి పెద్ద కొడుకు విజయ్ కుమార్ స్థానిక పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు. గుడి వద్దకు పెద్ద ఎత్తున భక్తులు వస్తే కానీ.. వీరి చిన్న షాపు నడవదు. ఈ కుటుంబం అరకొర ఆదాయంతో నెట్టుకొస్తున్నాడు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ గుడికి వచ్చి పూజలు చేస్తున్న విషయం తెలుసుకున్న విజయ్ కుమార్ మంత్రి వద్దకు వెళ్లి ఆయన చేయి పట్టుకుని.. దీనంగా తనను చదివించమని కన్నీళ్లతో వేడుకున్నాడు. ఆ చిన్నారి చదువుకోవాలన్న తపన చూసి మంత్రి చలించిపోయారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ తన మానవత్వాన్ని చూపించారు.. విజయ్ కుమార్ తల్లిదండ్రులను పిలిచి వారి వివరాలు తెలుసుకున్నారు. వారి పరిస్థితి చూసి బాబు ఎంతవరకు చదివితే అంతవరకు చదివిస్తానని భరోసానిచ్చారు. అంతేకాదు విజయ్ కుమార్ ని తన వెంట మహబూబ్నగర్ తీసుకెళ్లి, ఓ ప్రైవేటు పాఠశాలలో చేర్పించారు. బాబు కి ఉండటానికి హాస్టల్ వసతి, యూనిఫామ్, పుస్తకాలు ఇతర వస్తువులు ఇప్పించారు. బాలుడు చదువు పూర్తయ్యే వరకు పూర్తి బాధ్యత తానే వహిస్తానని తల్లిదండ్రులకు హామీ ఇచ్చాడు. ఇలా మంత్రి శ్రీనివాస్ గౌడ్ తన మానవత్వం చూపించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.