తెలంగాణ మిల్లెట్ మ్యాన్, డీడీఎస్ వ్యవస్థాపకులు పీవీ సతీష్ (77) ఇకలేరు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారు జామున ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. జీవ వైవిధ్యం, ఆహార సౌర్వ భౌమ త్యం, మహిళా సాధికారికత కోసం ఉద్యమించడంతో పాటు ఎనలేని కృషి చేశారు.
తెలంగాణ మిల్లెట్ మ్యాన్గా పేరు పొందిన పిరియాపట్న వెంకట సుబ్బయ్య సతీష్ (పీవీ సతీష్) తుది శ్వాస విడిచారు. కొన్ని రో్జులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారు జామున ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. 1983లో జహీరాబాద్ కేంద్రంగా దక్కన్ డెవలప్ మెంట్ సొసైటీ (డీడీఎస్ )ను స్థాపించి పర్యావరణహిత వ్యవసాయ ఆహార వ్యవస్థల్లో విశేష కృషి చేసి ‘మిల్లెట్ మ్యాన్’గా పేరొందారు. డీడీఎస్ ద్వారా దళిత మహిళలు, పేదలకు అక్షరాస్యత కల్పించడంతో పాటు వారి ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటునిచ్చేవారు. ఆయన ఈ సంస్థ స్థాపించడానికి ముందు దూరదర్శన్లో పనిచేశారు. జహీరాబాద్, కోహీర్, ఝరాసంగం, మొగుడంపల్లి, న్యాల్కల్, రాయికోడ్, మనూరు మండలాల్లో తమ కార్యక్రమాలు నిర్వహించారు.
సతీష్ వ్యవసాయ జీవవైవిధ్యం, ఆహార సార్వభౌమత్వం, మహిళా సాధికారత, సామాజిక న్యాయం, స్థానిక విజ్ఞాన వ్యవస్థలు, భాగస్వామ్య అభివృద్ధి, గ్రామీణ తెలంగాణలో సంప్రదాయ పంటల పరిరక్షణ వంటి అంశాలపై ఉద్యమించారు. వ్యవసాయ భూముల్లో చిరు ధాన్యాలు సాగు చేసేలా ప్రోత్సహించారు. సేంద్రియ ఎరువులతో చిరుధాన్యాల సాగుకు కృషి చేశారు. ఝరాసంగం మండలంలోని మచునూరు గ్రామంలో పచ్చసాలే ఏర్పాటు చేసి చదువుతో పాటు కులవృతులపై శిక్షణ కలిపించారు. ప్రతి ఏడాది జనవరిలో పాత పంటల జాతర నిర్వహించి, వాటి సాగుపై అవగాహన కలిపించారు. చిరుధాన్యాల సాగుపై దేశ విదేశాల్లో నిర్వహించిన సదస్సుల్లో అవగాహన కల్పించారు. పస్తాపూర్లోని డీడీఎస్ కార్యాలయంలోని వ్యవసాయ క్షేత్రంలో ఆయన అంత్యక్రియలు సోమవారం జరగనున్నాయి.
సతీష్ మృతికి తెలంగాణ మంత్రి హారీష్ రావు, ప్రముఖులు సంతాపం తెలిపారు. సమాజానికి ఆయన చేసిన సేవలను పలువురు గుర్తు చేసుకున్నారు. ఆయన మరణ వార్త విని సంస్థ సిబ్బందితో పాటు జహీరాబాద్ ప్రజలు సైతం శోక సంద్రంలో మునిగిపోయారు. సతీష్ 1945 జూన్ 18న మైసూరులో జన్మించారు. న్యూఢిల్లీలోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అనంతరం జర్నలిస్టుగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గ్రామీణాభివృద్ధి, గ్రామీణ అక్షరాస్యతకు సంబంధించిన కార్యక్రమాలను రూపొందించి దూరదర్శన్కు దాదాపు రెండు దశాబ్దాల పాటు ప్రముఖ టెలివిజన్ ప్రొడ్యూసర్గా సేవలందించారు. ఆయన 1970 లలో (సైట్) చారిత్రాత్మక శాటిలైట్ ఇన్స్ట్రక్షనల్ టెలివిజన్ ప్రయోగంలో గణనీయమైన పాత్ర పోషించారు.