హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో అట్టహాసంగా ‘అలయ్ బలయ్’ కార్యక్రమం నిర్వహించారు. హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో అలయ్ బలయ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. 17 ఏళ్లుగా బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో ఈ అలయ్ బలయ్ కార్యక్రమం జరుగుతూ వచ్చింది. ఈ ఏడాది మాత్రం ఆయన కుమార్తె విజయలక్ష్మి ఆ బాధ్యత తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో దత్తాత్రేయ, వీ హనుమంతురావ్, మెగాస్టార్ చిరంజీవి డబ్బు వాయించి సందడి చేశారు. గరికపాటి నరసింహారావు ప్రవచనాలు, చలోక్తులతో అందరినీ ఉత్సాహపరిచారు. కొన్నేళ్లుగా తాను ఈ కార్యక్రమానికి రావాలని కోరుకుంటున్నాను అంటూ చిరంజీవి తన మనసులోని మాటను బయట పెట్టారు.
ఈ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ.. “ఈ అలయ్ బలయ్ కార్యక్రమం అంటే నాకు చాలా ఇష్టం. కొన్నేళ్లుగా నేను ఈ కార్యక్రమానికి రావాలని కోరుకుంటున్నాను. నా తమ్ముడు పవన్ కల్యాణ్కు అవకాశం వచ్చింది. అరవింద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు. నాకు ఎప్పుడు అవకాశం వస్తుందా అని ఎదురు చూశాను. ఇప్పుడు అవకాశం రావడంపై సంతోషంగా ఉంది. నిన్ననే ఒక మంచి హిట్ అందుకున్న సందర్భంగా మీ అందరినీ ఇలా ఈ కార్యక్రమంలో కలుసుకోవడం సంతోషంగా ఉంది. ఎప్పుడూ రాజకీయ, విద్యా, వైద్య, విజ్ఞాన పరంగానే కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. కానీ, కేవంల ప్రేమను పంచేందుకు సౌభ్రాతృత్వం కోసం కార్యక్రమాలు జరగవు. కానీ, 17 ఏళ్లుగా దత్తాత్రేయ గారు ఈ కార్యక్రమం నిర్వహిస్తూ రావడం సంతోషం. తెలంగాణ సంస్కృతి ఇక్కడ మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగానూ ఈ అలయ్ బలయ్ సంస్కృతి విస్తరించాలి” అంటూ మెగాస్టార్ చిరజీవి ఆకాంక్షించారు.