సాధారణంగా మనం అన్నం వండుకోవాలంటే కట్టెల పోయ్యి, స్టౌ లేదా ఎలక్ట్రికల్ పరికరాలు ఉపయోగిస్తుంటాం. మనకు కావాల్సినంత బియ్యం తీసుకొని అందులో సరిపడ నీరు పోసి వండుకుంటాం. అయితే ఇవేవీ అవసరం లేకుండా కేవలం నీరు పోసి కొద్దిసేపు నానబెడితే చాలు అన్నం రెడీ అంటున్నాడు తెలంగాణకు చెందిన ఒక యువరైతు. ఎలాంటి శ్రమ లేకుండా ఇంత త్వరగా అన్నం రెడీ ఎలా అవుతుందా అని ఆశ్చర్యపోకండి.. అసలు ఈ మ్యాజిక్ రైస్ విషయం తెలుసుకుందాం.
కరీంనగర్ జిల్లాకు చెందిన గార్ల శ్రీకాంత్ అనే రైతుది మొదటి నుంచి వ్యవసాయ కుటుంబం. చిన్నప్పటి నుంచి శ్రీకాంత్ వ్యవసాయం మీదనే ఆధారపడి జీవిస్తున్నాడు. గతంలో పలు రసాయనిక ఎరువులు వాడి పంట సాగు చేసేవారు.. కానీ ఇటీవల కాలంలో ఆయనకు తగినంత పెట్టుబడి లేకపోవడం.. దానికి తోడు నీరు కూడా అందకపోవడం తో ప్రకృతి వ్యవసాయం పై దృష్టి సారించారు. ఒకరోజు సుభాష్ పాలేకర్ రేడియో ప్రోగ్రామ్ లో ప్రకృతి వ్యవసాయం గురించి తెలుసుకొని అప్పటి నుంచి సేంద్రీయ పద్దతితో వ్యవసాయ పనులపై దృష్టి సారించారు. ప్రస్తుతం ఆయన పూర్తిగా సేంద్రియ పద్థతిలోనే వ్యవసాయం చేస్తున్నారు. శ్రీకాంత్ దాదాపు తొమ్మిది రాష్ట్రాలు తిరిగి 120 వరకు దేశీయ వరి వంగడాలను సేకరించినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా గార్ల శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘ప్రతి సంవత్సరం కొత్త రకం వరి విత్తనాలు సేకరించి ప్రయోగాలు చేస్తుంటాను.. ఈ క్రమంలోనే అసోంలోని కొన్ని తెగల వాళ్లు పండించే బోక సాల్ కి చెందిన విత్తనాలు తీసుకు వచ్చి సాగు చేశాను. బోకసాల్ వరి సాగు చేసే సమయం జూన్ నుంచి డిసెంబర్.. సుమారు 145 రోజుల్లో పంట చేతికి వస్తుంది. ఇక బోకసాల్ బియ్యం కేవలం నీటిలో నానబెడితే చాలు అర్థగంటలో అన్నం రెడీ. ఈ బియ్యం వేడినీటిలో వేస్తే వేడిగా.. చల్లనీటిలో వేస్తే చల్లగా అవుతుందని అన్నారు.
ఈ రైస్ ఆర్మీ వాళ్లు ఎక్కువగా తింటుంటారు. దీనికి ఎలాంటి కర్రీ కూడా అవసరం లేదు.. ఈ బియ్యం లో ఫైబర్ పర్సంటేజ్ ఎక్కువగా ఉండటం జీర్ణశక్తిని మెరుగు పర్చడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఈ మ్యాజిక్ రైస్ లో 10.73 శాతం ఫైబర్, 6.8 శాతం ప్రోటీన్లు ఉన్నాయి.. ఈ విషయాన్ని గౌహతీ యూనివర్సిటీ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ సంస్థలు తెలిపాయని అన్నారు.’ ఈ మ్యాజిక్ విత్తనాన్ని రైతులకు అందించి సాగు చేసేందుకు వాళ్లకు పలు సూచనలు కూడా ఇస్తానని శ్రీకాంత్ చెబుతున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.