కాలేజీల్లో ఏదైనా ముఖ్యమైన కార్యక్రమం జరిగినప్పుడు.. ప్రముఖ వ్యక్తులు ముఖ్య అతిథిగా హాజరవ్వడం అనేది మామూలే. వాళ్ళు వచ్చినప్పుడు విద్యార్థులతో ప్రసంగం ఇప్పిస్తారు. అయితే ఆ ప్రసంగంలో అమ్మాయి గానీ, అబ్బాయి గానీ మాట్లాడుతుంటే మధ్యలో కొంతమంది పోకిరీలు వెకిలి చేష్టలు వేస్తుంటారు. లెక్చరర్స్ మాట్లాడుతుంటే మధ్యలో అరుస్తుంటారు. ఈ జబ్బు ఎక్కడ నుంచి వచ్చిందో తెలియదు గానీ కొంతమంది విద్యార్థులు దీన్ని అనుకరిస్తున్నారు. అక్కడున్నది సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, మరోపక్క నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమం, దేశం గురించి ప్రసంగిస్తున్న అమ్మాయి. ఇవేమీ అర్థం చేసుకోని స్థితిలో కొంతమంది ఆకతాయి విద్యార్థులు ఉన్నారు. మరి ఈ జబ్బుకి మందు వేయకుండా ఎలా ఉంటారు. లక్ష్మీనారాయణ వాళ్ళకి అక్కడే మందు వేసి బుద్ధి చెప్పారు.
లక్ష్మీనారాయణ ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటారు. అలాంటిది ఉన్నట్టుండి ఒకేసారి ఆయన ఆగ్రహానికి గురయ్యారు. అది కూడా విద్యార్థుల మీద. ‘ఎవడ్రా వాడు, దమ్ముంటే బయటికి రారా.. సిగ్గు, శరం లేకుండా కూర్చున్నారు’ అంటూ విద్యార్థుల మీద నిప్పులు చెరిగారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. జనగణమన గీతాలాపన ప్రారంభించుకుని రెండేళ్లు పూర్తైన సందర్భంగా నల్గొండ జిల్లాలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లక్ష్మీ నారాయణ పాల్గొన్నారు. కార్యక్రమంలో వేదికపై ఓ విద్యార్థిని దేశం గురించి ప్రసంగిస్తున్న సమయంలో.. విద్యార్థుల్లో కొందరు ఆకతాయిలు అమ్మాయి మీద కామెంట్లు చేసారు. వెకిలి చేష్టలతో న్యూసెన్స్ క్రియేట్ చేశారు. దీంతో ఎప్పుడూ శాంతంగా ఉండే లక్ష్మీనారాయణ సహనం కోల్పోయారు. కామెంట్స్ చేసిన విద్యార్థులపై కోపంతో ఊగిపోయారు.
‘ఎవడ్రా వాడు.. బయటికి రా.. దమ్ముంటే బయటికి రారా. సిగ్గు, శరం లేకుండా కూర్చున్నారు. ఒక అమ్మాయి వచ్చి మన ముందు మాట్లాడుతుంటే.. పిల్లికూతలు, కుక్క కూతలు కూసే అద్వానమైన వ్యక్తులు. తీయండి వాళ్ళని బయటకి, తోసిపడేయండి బయటకి. ఇట్లాంటి వాళ్ళు ఉండబట్టే దేశం ఇలా ఉంది. ఇందాకటి నుంచి చూస్తున్నా వీళ్ళని. అమ్మాయిల వెనుక లైన్ లో కూర్చున్న వారిలోనే ఆ వెధవలు ఉన్నారు. ఆ హెయిర్ స్టైల్, మీరూ విద్యార్థుల్లా ఉన్నార్రా మీరు. ఏం సాధించారని అరుస్తున్నారు’ అంటూ మండిపడ్డారు. మరి విద్యార్థులు ఇలా ప్రవర్తించడంపై మీ అభిప్రాయమేమిటి? లక్ష్మీనారాయణ కోప్పడడంపై మీ అభిప్రాయమేమిటి? దేశం గురించి, దేశభక్తి గురించి కనీస మర్యాద ఇవ్వని ఇలాంటి విద్యార్థుల పట్ల మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.