తెలంగాణలో ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. అసెంబ్లీ ఎన్నికలకు కేవలం ఏడాది మాత్రమే సమయం ఉంది. దాంతో అధికార పార్టీతో పాటు విపక్షాలు కూడా రెడీ అవుతున్నాయి. ఇక ఎన్నికలు దగ్గర పడుతుండటంతో.. అధికార పార్టీ ఇచ్చిన హమీల అమలుపై దృష్టి పెట్టింది. ఇప్పటికే సీఎం కేసీఆర్ నేతలతో వరుస సమవేశాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ శుభవార్త చెప్పారు. సొంత స్థలాలుండి ఇళ్లు లేని నిరుపేదలకు రూ.3 లక్షలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలిపారు. ఈ పథకాన్ని డిసెంబరులో ప్రారంభించనుందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. అంతేకాక డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరై.. నిర్మాణాలు జరగని గ్రామాల్లో రాజకీయాలకు అతీతంతగా లబ్ధిదారులను ఎంపిక చేయాలని ఈ సందర్భంగా కేటీఆర్ ఆదేశించారు.
రూ.5.04 లక్షల పథకం మంజూరు కానీ వారిని రూ. 3 లక్షల పథకంలో అర్హులుగా గుర్తించాలన్నారు కేటీఆర్. ఈ రెడు పథకాల్లోని వ్యత్యాసాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధులదే అని స్పష్టం చేశారు. డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీని ఏడాదిలోగా పూర్తి చేయాలని కేటీఆర్ ఆదేశించారు. అలానే నిరుపేదలకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. దీనిలో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా గురుకులాల సంఖ్యను 200 నుంచి 1000కి పెంచిందని తెలిపారు.