తెలంగాణ, నల్లగొండ జిల్లా అనగానే గుర్తుకు వచ్చేది ఫ్లోరోసిస్ భూతం. ఏళ్ల తరబడి ఎందరో జీవితాలను బలి తీసుకుంది ఫ్లోరైడ్. ప్రభుత్వాలు మారినా.. ఇక్కడి పరిస్థితుల్లో.. ప్రజల జీవితాల్లో ఏమాత్రం మార్పు రాలేదు. అంతర్జాతీయంగా ఈ సమస్యపై చర్చ జరిగినా.. ఇక్కడి నేతలు మాత్రం పట్టించుకోలేదు. పక్కనే కృష్ణమ్మ పారుతున్న నల్లగొండ జిల్లా బిడ్డలు మాత్రం.. తాగడానికి సురక్షితమైన నీరు లేక.. ఫ్లోరైడ్ భూతానికి బలయ్యారు. కాళ్లు, చేతుల సరిగా ఎదగక.. ఏ పని చేసుకోలేక.. ఎటూ కదల్లేని స్థితిలో ఉంటూ.. జీవచ్చావాలుగా బతకాల్సిన పరిస్థితి. అలా ఫ్లోరైడ్ బాధితుడిగా జన్మించినప్పటికి.. భవిషత్తు తరాల జీవితాలు తమలా కాకుడదనే ఉద్దేశంతో 30 ఏళ్లుగా ఫ్లోరోసిస్ రక్కసిపై అలుపెరుగని పోరాటం చేసిన అంశాల స్వామి.. శనివారం మృతి చెందారు.
ట్రై సైకిల్ పై నుంచి ప్రమాదవాశాత్తు కింద పడిన ఆయన.. చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం కన్నుమూశారు. ఆయన మృతిపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా సంతాపం తెలిపారు. ‘‘అంశాల స్వామి గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. ఫ్లోరోసిస్ బాధితుల కోసం ఆయన చేసిన పోరాటం అసామాన్యం. స్వామి ఎందరికో ప్రేరణగా నిలిచాడు. ఆయన ఎల్లప్పుడు నా హృదయానికి దగ్గరగా ఉంటాడు. స్వామి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను’’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. అలానే గతంలో.. స్వామితో కలిసి భోజనం చేసిన ఫోటోను ఈ సందర్భంగా ట్వీట్ చేశాడు కేటీఆర్.
My Heartfelt condolences to the family of Sri Amshala Swamy Garu who passed away today
He was a fighter who championed the cause of Fluorosis victims & an inspiration to many. He will always remain close to my heart
May his soul rest in peace 🙏 pic.twitter.com/wCv5DHWeGg
— KTR (@KTRBRS) January 28, 2023
నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం శివన్నగూడెం గ్రామానికి చెందిన స్వామి.. ఫ్లోరోసిస్కు వ్యతిరేకంగా జరిగిన అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. గత 30 ఏళ్లుగా ఆయన ఫ్లోరోసిస్ భూతంపై పోరాడుతున్నాడు. అంతేకాక ఫ్లోరైడ్ సమస్యలపై సామాజిక వేత్త దుశ్చర్ల సత్యనారాయణ స్థాపించిన జలసాధన సమితితో కలిసి పోరాటాలు చేశారు స్వామి. రాష్ట్ర ముఖ్యమంత్రులు, మంత్రుల వద్ద తన గోడును వెళ్లబోసుకున్నాడు. ఇక వాజ్పేయ్ ప్రధానిగా ఉన్న సమయంలో.. అంశాల స్వామిని ఢిల్లీకి తీసుకెళ్లిన దుశ్చర్ల.. ప్రధాని టేబుల్పై స్వామిని పడుకోబెట్టి సమస్యను వివరించే ప్రయత్నం చేశారు. అంశాల స్వామి పరిస్థితిని చూసి నాటి ప్రధాని వాజిపేయి చలించిపోయారు. సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు.
ఆ తర్వాత జరిగిన ఉద్యమాల్లోనూ ఫ్లోరైడ్ బాధితుల కోసం అంశాల స్వామి ఏళ్లుగా పోరాటం చేశారు. గ్రామంలో శిథిలావస్థలో ఉన్న ఇంట్లోనే ఉంటున్న స్వామి.. మంత్రి కేటీఆర్ సహకారంతో సొంతింటి కలను నెరవేర్చుకున్నారు. గత ఏడాది ఆయన సొంత ఇంట్లోకి ప్రవేశించారు. ఇక మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా మంత్రి కేటీఆర్ స్వయంగా అంశాల స్వామి ఇంటికి వెళ్లి ఆయనతో కలిసి భోజనం చేశారు. అనంతరం యోగక్షేమాలు అడిగి తెలుసుకొని.. స్వామి కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటామని కేటీఆర్ హామీ ఇచ్చారు. స్వామి మృతి నేపథ్యంలో పలువురు రాజకీయ నాయకులు, సామాజివేత్తలు సంతాపం తెలుపుతున్నారు.