ప్రస్తుత కాలంలో వివాహం అనేది స్టేటస్కు నిదర్శనంగా మారింది. జీవితంలో ఒక్కసారే జరిగే వేడుక అంటూ… లక్షలు ఖర్చు చేసి అంగరంగ వైభవంగా వివాహ వేడుక నిర్వహిస్తున్నారు. సంగీత్, మెహందీ, ప్రీ వెడ్డింగ్ షూట్ లాంటి సంస్కృతులు ఇప్పుడు మన దగ్గర కూడా వచ్చాయి. సామాన్యులు సైతం ఇందు కోసం లక్షలు వెచ్చిస్తున్నారు. ఇక కోటీశ్వరుల సంగతి అయితే చెప్పక్కర్లేదు. వెడ్డింగ్ కార్డ్ ఇచ్చేటప్పుడే ఖరీదైన బహుమతులు ఇచ్చే వారు ఉన్నారు. ఇక నిశ్చితార్థం, పెళ్లి వేడుక కోసం సినిమా రేంజ్లో భారీ సెట్లను ఏర్పాటు చేస్తారు. మొత్తం మీద పెళ్లి కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసేవారు ఉన్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఖమ్మంలో ఇద్దరు రాజకీయ నేతల ఇంట పెళ్లి సందడి చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు. మరి కొందరు మాత్రం ఇన్ని కోట్లు ఖర్చు చేయడం… ఇంత ఆర్భాటం అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. ఆ వివరాలు..
ఖమ్మం జిల్లా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన కుమార్తె రిసెప్షన్ వేడుకను ఖమ్మంలో ఈ నెల 17న గ్రాండ్గా చేయనున్నారు. అదుకోసం పొంగులేటి.. భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పెళ్లికి ఆహ్వానించే వారికి వివాహ పత్రికలతోపాటు గోడ గడియారాలను బహుమతిగా ఇచ్చారు. ఇక త్వరలో నిర్వహించబోయే రిసెప్షన్ వేడుక గురించి కేవలం జిల్లాలోనే మాత్రమే కాక యావత్తు తెలంగాణ అంతా మాట్లాడుకునే విధంగా.. అత్యంత వైభంగా జరిపేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక పొంగులేటి ఇంట వివాహ వేడుక ఇంత ఘనంగా జరగుతుండగా.. మరోవైపు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కూడా తన కొడుకు వివామాన్నిసైతం గ్రాండ్గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. పువ్వాడ నయన్ రాజ్ వివాహం ఈ నెల 20 న జరగనుంది.
కోటి రూపాయలతో ఏకంగా బ్రిడ్జి నిర్మాణం..
పొంగులేటి తన కుమార్తె రిసెప్షన్ వేడుకను ఖమ్మంలోని ఎస్ఆర్ గార్డెన్ సమీపంలో ఏర్పాటు చేశారు. ఈ వేదిక వద్దకు వెళ్లే మార్గంలో డీప్ కట్ ఉంది. వేడుకకు వచ్చే వాహనాల రాకపోకలను దృష్టిలో ఉంచుకుని ఏకంగా ఈ కెనాల్పై రూ.కోటి వ్యయంతో అత్యవసరంగా బ్రిడ్జిని నిర్మాణం చేశారు. ఐరన్తో ఏర్పాటు చేసిన ఈ బ్రిడ్జి కేవలం నెల రోజుల్లోనే నిర్మించడం విశేషం. ఇప్పుడు ఇది జిల్లా వ్యాప్తంగా చర్చానీయాంశంగా మారింది.
బాహుబలి రేంజ్లో భారీ సెట్టింగులు..
వివాహ రిసెప్షన్ను ఎస్ఆర్ గార్డెన్స్ సమీపంలోని వంద ఎకరాల ప్రాంతంలో నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలో సుమారు 3 లక్షల మంది అతిధులకు భోజనం చేసే విధంగా ఏర్పాట్లు చేయడం విశేషం. ఇందులో 30 ఎకరాల్లో రిసెప్షన్ వేదికతో పాటు పార్కింగ్కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు, వివాహ రిసెప్షన్ వేదికలు బాహుబలి లాంటి సెట్టింగ్లతో నిర్మాణం చేయడం గమనార్హం. వర్షాకాలం కావడంతో ప్రత్యేకంగా టెంపరరీ వాటర్ప్రూప్ షెడ్లను నిర్మిస్తున్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొదటి నుంచి సంచలనాలకు మారుపేరుగా నిలిచిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రస్తుతం తన కుమార్తె వివాహ రిసెప్షన్ సందర్భంగా కనివినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేసి.. రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారారు. ఇక ఈ వివాహ రిసెప్షన్కు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరుకానున్నట్లు ప్రచారం సాగుతుంది. అంతేకాక మరోవైపు మంత్రి పువ్వాడ అజయ్కుమార్ కూడా తన కొడుకు పెళ్లిని ఇంతే గ్రాండ్గా చేస్తారా అని చర్చించుకుంటున్నారు స్థానిక ప్రజలు. మరి ఈ ఏర్పాట్లపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.