తెలుగు రాష్ట్రాల్లో పాలన గాడి తప్పిందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన కేఏ పాల్.. తెలుగు రాష్ట్రాలు దివాలా తీశాయని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఇప్పుడున్న అధికార పార్టీలకు ఓటు వేయొద్దని సూచించారు. భాజపా తప్పులను ఎత్తి చూపుతున్న మంత్రి కేటీఆర్.. తెరాస తప్పులను ఎందుకు కప్పిపుచ్చుతున్నారని ప్రశ్నించారు. తెలుగు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి.. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితికి వచ్చిందని కేఏ పాల్ ఆరోపించారు.
‘భాజపా వాళ్లు రాజ్యసభ ఎంపీగా ఇచ్చి.. ఉప ప్రధాని ఇస్తా అన్నారు. కానీ.. నేను ఒప్పుకోలేదు. డబ్బులతో సొంత మీడియాలు పెట్టుకొని సొంత డబ్బా కొట్టుకుంటున్నారు. బడుగు బలహీనవర్గాల ప్రజలు ఇప్పుడున్న అధికార పార్టీలకు ఓటు వేయొద్దు. తెలంగాణలో గ్రామ గ్రామాన పర్యటిస్తా. ప్రపంచంలో నాలాంటి వ్యక్తి ఒక్కరూ కూడా లేరు. నా ప్రతిభ గురించి తెలిసే మోదీ, కేసీఆర్, జగన్ భయపడతారు. కేఏ పాల్ తమ ప్రత్యర్థి అని కేటీఆర్ గుర్తించాలి. రాబోయే ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీకి తెలంగాణలో 72, ఆంధ్రప్రదేశ్లో 102 సీట్లు వస్తాయని కేఏ పాల్ చెప్పుకొచ్చారు.
ప్రజల సమస్యలు ఏంటి? వాటిని ఎలా పరిష్కరించాలన్న దానిపై చర్చించాల్సింది పోయి ఒకరినొకరు తిట్టుకోవడంతోనే రాజకీయ నాయకులు సమయం గడిపేస్తున్నారని కేఏ పాల్ మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లోపు దేశమంతా పర్యటిస్తానని ప్రకటించారు. ఇప్పటివరకూ దేశంలో 18 పార్టీల నాయకులను కలిపేశానని.. ప్రతి ఒక్కరినీ కలుపుకొంటూ పోవాలన్నదే తన అభిమతమని కేఏ పాల్ చెప్పుకొచ్చారు.