అమ్మ అంటే.. నడిచే దైవం. తన నోరు కట్టుకుని బిడ్డల కడుపు నింపుతుంది.. తన కోరికలను చంపుకుని.. బిడ్డల కోరికలు తీరుస్తుంది. బిడ్డల భవిష్యత్తు కోసం రెక్కలు ముక్కలు చేసుకుంటుంది. బిడ్డలు తమ కాళ్ల మీద తాము నిలబడ్డ తర్వాతే తల్లి కాస్త సేదదీరుతుంది. ఇన్నాళ్లు కనీసం ఊపిరి తీసుకోవడానికి కూడా ఆగని తల్లి.. బిడ్డలు ప్రయోజకులయ్యాక.. కాస్త సేదదీరుతుంది. బిడ్డలతో కలిసుంటూ.. మనవళ్లు, మనవరాళ్ల బాగోగులు చూసుకుంటూ.. వారి బుడి బుడి అడుగులు.. ముద్దు ముద్దు మాటలు వింటూ.. జీవిత చరమాంకంలో ప్రశాంతంగా గడిపి.. సంతోషంగా కన్ను మూయాలనుకుంటుంది.
అయితే నేటి కాలంలో కొందరు కసాయి బిడ్డలు.. తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిని ప్రేమిస్తున్నారు.. అమ్మానాన్నలను గాలికొదిలేస్తున్నారు. జీవితం చివరి దశంలో బిడ్డల ఆదరణకు నోచుకోక.. పట్టెడన్నం కోసం చేయి చాచలేక.. నరకయాతన అనుభవిస్తున్నారు. చివరికి ఆకలి బాధని జయించలేక.. ఆత్మాభిమానం చంపుకుని.. అడుక్కుతింటున్న తల్లిదండ్రలు ఎందరో ఉన్నారు. తాజాగా ఓ అభాగ్యపు తల్లి.. కథ వెలుగులోకి వచ్చింది. ఆమె కథ వింటే కన్నీరాగదు.
జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం జైనా గ్రామానికి చెందిన టేకుమాట్ల బాలయ్య, లస్మవ్వ దంపతులకు ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు సంతానం ఉన్నారు. భార్యాభర్తలిద్దరూ రాత్రింబవళ్లు కష్టపడి.. రెక్కలు ముక్కలు చేసుకుని.. డబ్బులు సంపాదించి.. బిడ్డలందరిని పెంచి పెద్ద చేశారు. తమకున్నంతో బిడ్డలందరికీ పెళ్లిళ్లు కూడా చేసేశారు. ఇక 11 ఏళ్ల క్రితం అనగా.. 2012లో బాలయ్య కాలం చేయటంతో లస్మవ్వ(98) కొడుకుల దగ్గర ఉండిపోయింది. తాము ఎంతో కష్టపడి పెంచిన బిడ్డలు.. తనకు పట్టెడన్నం పెట్టరా.. అనే నమ్మకంతో.. ఆ పిచ్చి తల్లి ఉన్న 10 ఎకరాల భూమిని ఇద్దరు కొడుకులకు సమానంగా పంచి ఇచ్చింది. ఆస్తులు పంచుకున్నట్లే కాదు.. తన బాధ్యతను కూడా అలాగే సమానంగా చూసుకోవాలని చెప్పింది.
పెద్ద కుమారుడు ఆస్తితో పాటు.. అమ్మ బాధ్యతను కూడా తీసుకున్నాడు. కానీ చిన్న కొడుకు ప్రభాకర్ ఆస్తి తీసుకుని.. అమ్మను వదిలేశాడు. ఉన్న భూమిని చెరి సగం పంచి ఇచ్చినప్పటికీ తల్లిని పట్టించుకోవడం మానేశాడు ప్రభాకర్. దీంతో లస్మవ్వ.. పెద్ద కుమారుడు రాజన్న వద్దే ఉంటుంది. అయితే చిన్న కొడుకు తీరుపై పెద్దమనుషులు ఎన్నిసార్లు పంచాయతీలు చేసినప్పటికీ అతడి ప్రవర్తనలో మాత్రం మార్పు రాలేదు. ఈ క్రమంలో తన బాధ్యతలను చిన్న కొడుకుకు అప్పగించాలంటూ నడవలేని స్థితిలో ఉన్న 98 ఏళ్ల లస్మవ్వ ఆర్డీవో ఆఫీస్కు వచ్చింది. తన గోడు వెళ్లబోసుకుంది. ఇక వృద్ధురాలి బాధను విన్న ఆర్డీవో మాధవి.. న్యాయం చేస్తానంటూ హామీ ఇచ్చారు.
కని పెంచి.. లక్షల రూపాయల విలువైన ఆస్తులు పంచి ఇచ్చిన అమ్మ పట్ల ఇంత దారుణంగా వ్యవహిరిస్తున్న ప్రభాకర్పై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 98 ఏళ్ల వయసులో కదల్లేని స్థితిలో ఉన్న తల్లి ఆలనాపాలనా చూడకుండా ఇలా వ్యవహరించడమేంటని మండి పడుతున్నారు. ఇలాంటి కొడుకు పుట్టడం కన్నా గిట్టడమే మేలంటున్నారు. మరి లస్మవ్వ చిన్న కొడుకు తీరు మారాలంటే ఏం చేయాలి.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.