సంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ యువతికి కొన్నేళ్లుగా ఓ యువకుడిని ప్రేమించింది. అతడూ ప్రేమించాడు. ఇద్దరు త్వరలోనే పెళ్లి చేసుకుని భవిష్యత్ జీవితాన్ని పండించుకోవాలని కలలు కన్నారు. కానీ ఇంతలో కరోనా మహమ్మారి ఆ యువతికి సోకింది. చికిత్స కోసం హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆ యువతిని చేర్చారు. అప్పటి నుంచి ఆ యువతి సోదరుడు, ఆ యువతిని మూడేళ్లుగా ప్రేమిస్తున్న యువకుడు అక్కడే ఉండి వైద్య చికిత్స చూసుకుంటున్నారు. కొన్ని రోజులుగా ఆ యువతి పరిస్థితి క్రమంగా విషమిస్తూ ఉంది. ఈ సమయంలో ఆ యువతికి ధైర్యం ఇచ్చేందుకు ఆమె ప్రియుడు ఐసీయూలోనే తాళి కట్టాడు.
ఎలాగైనా కాపాడుకుంటాను., త్వరలోనే కరోనా నయమైపోతుంది. మళ్లీ అందరి ముందు పెళ్లి చేసుకుందాం ఆనందంగా జీవిద్దాం అంటూ ఆ యువతికి జీవితంపై ఆశలు కలిగేలా నమ్మకం, ధైర్యం ఇస్తూ వచ్చాడు. అయితే అంతగా ఆమె ఆరోగ్యం కోసం తాపత్రయపడినా చివరకు ఫలితం లేకుండా పోయింది. ఆ యువతిని కరోనా బలి తీసుకుంది. ఈ విషయం ఇంట్లో చెప్పలేక ఆ యువతి సోదరుడు, ఆమె భర్త హైదరాబాద్లోనే అంత్యక్రియలు చేసేశారు. ఆమె బాగయి ఇంటికి వస్తుందని ఆశగా ఎదురు చూసే తల్లిదండ్రులకు ఏం చెప్పాలో తెలియక యువతి సోదరుడు తల్లడిల్లిపోతున్నాడు. తనలో తానే కుమిలిపోతున్నాడు. ఆమె మరణించిన విషయం మాత్రం తల్లిదండ్రులకు తెలియదు.