నూతన సచివాలయం ప్రారంభోత్సవం దృష్ట్యా ఆదివారం హుస్సేన్ సాగర్, నెక్లెస్ రోడ్, సైఫాబాద్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. కావున వాహనదారులు అందుకు సహకరించాలని కోరారు. వాహనదారులు ట్రాఫిక్ మళ్లింపుల వివరాలు ముందుగానే తెలుసుకొని జాగ్రత్త పడాలని మనవి.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నూతన సచివాలయం ప్రారంభానికి సిద్ధమైంది. ఈ నెల ఏప్రిల్ 30న ఆదివారం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దీన్ని ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉండటంతో హుస్సేన్సాగర్, నెక్లెస్ రోడ్ పరిసరాల్లో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. ఆదివారం ఉదయం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. కావున వాహనదారులు అందుకు సహకరించాలని నగర ట్రాఫిక్ అదనపు సీపీ సుధీర్ బాబు ఓ ప్రకటనలో తెలిపారు.
హుస్సేన్ సాగర్, నెక్లెస్ రోడ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని తెలిపిన సీపీ.. సచివాలయం ప్రారంభోత్సవం దృష్ట్యా ఆదివారం ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, లుంబనీ పార్క్, నెక్లెస్ రోడ్డును పూర్తిగా మూసి వేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే అప్పటి రాకపోకలను బట్టి పీవీ విగ్రహం, నెక్లెస్ రోటరీ, ఎన్టీఆర్ మార్గ్, తెలుగు తల్లి జంక్షన్ మార్గాల్లో ట్రాఫిక్ను నిలిపివేయడం, మళ్లింపులు చేయనున్నట్లు తెలిపారు. అలాగే సచివాలయ ప్రారంభోత్సవానికి వచ్చే ఆహ్వానితులు తమ కార్లకు పాస్లను అతికించుకోవాలని సీపీ కోరారు.
సోమాజిగూడ, పంజాగుట్ట, ఖైరదాబాద్ వైపు నుంచి వాహనదారులకు నెక్లెస్ రోడ్డు వైపు అనుమతి లేదు. ఈ వాహనాలను వీవీ విగ్రహం చౌరస్తా నుంచి సాదన్ కాలేజీ, నిరాంకారి భవన్ వైపు మళ్లించనున్నారు. అలాగే లిబర్టీ వైపు నుంచి వచ్చే వాహనాలకు తెలుగుతల్లి జంక్షన్, తెలుగు తల్లి ఫ్లై ఓవర్, అంబేద్కర్ విగ్రహం వైపు అనుమతి లేదు. ఈ వాహనాలు లోయర్ ట్యాంక్బండ్ వెళ్లాలి. ఇక ట్యాంక్బండ్, తెలుగుతల్లి జంక్షన్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ వైపు వచ్చే వాహనదారులు, బీఆర్కే భవన్ వైపు నుంచి ఎన్టీఆర్ మార్గ్ వైపు వెళ్లే వాహనదారులు ఇక్బాల్ మినార్ జంక్షన్ వైపు వెళ్ళాలి. ఇక ఆఫ్జల్గంజ్ నుంచి సికింద్రాబాద్కు ట్యాంక్బండ్ మీదుగా వచ్చే వాహనదారులు తెలుగుతల్లి ఫ్లై ఓవర్ నుంచి కట్టమైసమ్మ ఆలయం వద్ద నుంచి లోయర్ ట్యాంక్బండ్, డీబీఆర్ మిల్స్, కవాడిగూడ వైపు వెళ్లాలి.