ప్రస్తుత కాలంలో వైద్యం ఎంతటి ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రైవేట్ ఆస్పత్రిలో ఖర్చులను భరించలేము. ప్రభుత్వ ఆస్పత్రిలో సరైన పర్యవేక్షణ, సరిపడా సిబ్బంది ఉండక.. పట్టించుకునే వారు లేక.. ఎన్ని ఇబ్బందులు పడాలో అందరికి తెలుసు. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే ఒక్క మాట చాలు అక్కడ పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయో చెప్పడానికి. అందుకే అప్పు చేసైనా సరే.. చాలా మంది ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లడానికే మొగ్గు చూపుతారు. ప్రాణం దక్కాలంటే ఖర్చు గురించి ఆలోచించకూడదు. అయితే అక్కడక్కడ కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు మాత్రం.. డబ్బు కన్నా మనిషి ప్రాణానికి విలువ ఇస్తూ.. అత్యంత తక్కువ ఖర్చుకే నాణ్యమైన వైద్యాన్ని అందిస్తున్నాయి. ఈ కోవకు చెందిన ఆస్పత్రి ఒకటి హైదరాబాద్లో ఉంది. కేవలం ఒక్క రూపాయికే ఓపీ వైద్య సేవలు అందిస్తూ.. పేదల పాలిట వరంగా నిలుస్తోంది. ఆ వివరాలు..
ప్రజలకు ఒక్క రూపాయికే వైద్య సేవలు అందిస్తున్న ఈ ఆస్పత్రి.. రాంనగర్లో ఉంది. అదే జీజీ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలోని డీఎస్ఆర్ అండ్ డీవీఆర్ ఆస్పత్రి. రాంనగర్ మెయిన్ రోడ్డు పక్కన 50 పడకలతో ఏర్పాటు చేసిన ఈ ఆస్పత్రి.. కేవలం ఒక్క రూపాయికే ఓపీ వైద్య సేవలు అందిస్తూ ప్రజలను ఆదుకుంటుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ ఆస్పత్రిని ప్రారంభించారు. ఇక అప్పటి నుంచి ఒక్క రూపాయికే ఓపీ సేవలు, సగం ధరకే టెస్ట్లు చేస్తూ.. కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని.. అత్యంత తక్కువ ధరకే ప్రజలకు అందిస్తోంది.
ఈ ఆస్పత్రిలో ప్రతి రోజు 300-400 మందికి వైద్య సేవలు అందుతున్నాయి. ఇక్కడ గైనకాలజిస్ట్, పీడియాట్రిక్, ఆర్థోపెడిక్, డెర్మటాలజీ, ఎండోక్రైనాలజీ, యూరాలజీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ, జనరల్ సర్జన్, శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించిన ఓపీ సేవలను కేవలం ఒక్క రూపాయికే అందిస్తున్నారు. డయాబెటిస్, బీపీ వంటి పరీక్షలు ఉచితంగా చేస్తుండగా.. అల్ట్రాసౌండ్, డిజిటల్ ఎక్స్రే, రక్త పరీక్షలతో పాటు వివిధ రకాల టెస్ట్లను 50శాతం ఫీజుకే చేస్తున్నారు. ఇక సర్జరీల కోసం పేదవారికి ప్రభుత్వం అందించే ఆరోగ్యశ్రీ వంటి సంక్షేమ పథకాలు వర్తించే విధంగా చర్యలు తీసుకుంటుంది. అలానే రోగులకు, వారితో పాటు వచ్చిన సహాయకులకు ఉదయం టిఫిన్తో పాటు మధ్యాహ్నం, రాత్రి భోజనం కూడా అందిస్తూ.. మానవత్తం చాటుకుంది. మరి ఈ ఆస్పత్రి అందిస్తున్న సేవలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.