నేటికాలంలో ఎవరు ఏం పని చేస్తున్నారో చెప్పలేము. ఎవరి పనిని తక్కువ అంచనా వేయలేము. బిచ్చామెత్తుకుని వారు సైతం బిల్డింగ్ లు కట్టిస్తున్నారు. పానీ పూరి బండి పెట్టుకున్న వాడు ప్యాలెస్ లు కట్టిస్తున్నాడు. అంటే వీరు చేస్తున్న ఈ పని వెనుకాల మరొకటేదో చేస్తుంటారని కొందరి అభిప్రాయం. కొన్ని సందర్భాల్లో మాత్రమే బయటపడుతుంటాయి. తాజాగా ఓ చెత్త అమ్ముకునే వ్యాపారి వద్ద రూ.1.24 కోట్లు ఉన్నాయి. ఆ స్క్రాప్ వ్యాపారి వద్ద నుంచి సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆ మొత్తాని స్వాధీనం చేసుకున్నారు. ఉత్తర ప్రదేశ్ లోని తన బంధువు ఆదేశాలతో హైదరాబాద్ లోని నలుగురికి పంచేందుకు ప్రయత్నించాడని ఓఎస్టీ పి. రాధా కిషన్ రావు తెలిపారు. ఇక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ఉత్తర ప్రదేశ్ లోని మీరాట్ కు చెందిన షోయాబ్ మాలిక్ అనే వ్యక్తి నగరానికి వలస వచ్చి మాసబ్ ట్యాంక్ లో నివాసం ఉంటున్నాడు. కొన్ని నెలల నుంచి జల్ పల్లిలో బిస్మిల్లా ట్రేడర్స్ పేరుతో స్క్రాప్ వ్యాపారం చేస్తున్నాడు. అయితే ఉత్తర ప్రదేశ్ లో ఉంటున్న మాలిక్ సమీప బంధువు కమిల్ మాలిక్ గుజరాతీ గల్లీ ప్రాంతానికి చెందిన భరత్ అనే వ్యాపారి నుంచి రూ.1.24 కోట్లు తీసుకోమని తెలిపాడు. దీంతో గురువారం షోయాబ్ తన వద్ద పనిచేసే ఉద్యోగి అక్లాగ్ పంపి డబ్బులు తెప్పించుకున్నాడు. ఆ డబ్బును కమిల్ మాలిక్ ఆదేశాల మేరకు నగరంలోని సంభవ్, ఆదిల్, మినాజ్, షఫీలకు ఇవ్వాలని షోయాబ్ భావించాడు.
అయితే ఈ వ్యవహారం పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఇన్ స్పెక్టర్ రఘనాథ్ నేతృత్యంలోని, ఎస్సై సాయికిరణ్ నేతృత్వంలోని బృందం దాడి చేసి షోయబ్ అదుపులోకి తీసుకున్నారు. షోయాబ్ మాలిక్ తో సహా అతడి వద్ద నుంచి రూ.1.24 కోట్లను స్వాధీనం చేసుకుని హుమాయున్ నగర్ పోలీసులకు అప్పగించారు. ఈ మొత్తం వ్యహారం హవాలా దందాగా పోలీసులు భావిస్తున్నారు. దీంతో ఇన్ కంటాక్స్ డిపార్ట్ మెంట్ కి సమాచారం ఇచ్చారు. ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.