హైదరాబాద్ గ్లోబల్ సిటీగా మారుతున్న తరుణంలో దేశం నలుమూలల నుంచి నగరానికి వచ్చే వారి సంఖ్య ఎక్కువైపోతుంది. ప్రపంచంలోని దిగ్గజ కంపెనీలు హైదరాబాద్ కు క్యూ కడుతుండడంతో ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాల నుంచి నగరానికి అధిక సంఖ్యలో వస్తున్నారు. దీంతో నగరంలో ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతంది. ఈ సమస్యను తీర్చడానికి ట్రాఫిక్ డిపార్ట్ మెంట్ తో పాటు ప్రభుత్వం కూడా పలు రకాల చర్యలు తీసుకుంటుంది. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్లైఓవర్ల నిర్మాణం, అండర్ వేస్ నిర్మించి ట్రాఫిక్ సమస్యను తీరుస్తున్నారు. దీంతో పాటు మెట్రోను నిర్మించి ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తున్నారు. అయితే హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ఊహించని షాక్ ఇచ్చింది.
కాలుష్యాన్ని తగ్గించి, ట్రాఫిక్ సమస్యను తీర్చే పనిలో భాగంగా నగరంలో మెట్రో నిర్మాణాన్ని చేపట్టారు. దీంతో ప్రయాణికులు మెట్రో ప్రయాణంతో సమయం ఆదా అవుతుండడంతో మెట్రో ప్రయాణానికే మొగ్గు చూపుతున్నారు. ఐటి ఉద్యోగులు, ఇతర ఉద్యోగాలు చేసుకునే వారు కార్యాలయాలకు సమయానికి చేరుకోలేక నానా ఇబ్బందులు పడేవారు. కానీ మెట్రో వచ్చిన తరువాత వారు ఆ సమస్యల నుంచి ఉపశమనం పొందారు. ఇటీవలె మెట్రో ఫేజ్ టు లో భాగంగా రాయదుర్గం నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రభుత్వం భూమి పూజ కూడా చేసింది. అయితే తాజాగా మెట్రో తీసుకున్న ఓ నిర్ణయం ప్రయాణికులకు షాకిచ్చింది. ఇప్పటికే మెట్రో చార్జీల రాయితీలో కోత విధించి ప్రయాణికులను నిరుత్సాహానికి గురిచేసింది.
ఇప్పుడు ఏకంగా టాయిలెట్ వాడకం పై చార్జీ వసూలు చేస్తామని ప్రకటించి ప్రయాణికులపై మరింత భారాన్ని పెంచింది. నగరంలో ఉన్నటువంటి మెట్రో స్టేషన్లలో కొన్నింటిలో మాత్రమే పబ్లిక్ టాయిలెట్స్ అందుబాటులో ఉన్నాయి. ఇప్పటి వరకు వాటిని ఉపయోగించినందుకు ప్రయాణికుల నుంచి ఎటువంటి రుసుం వసూలు చేయలేదు. కానీ ఇకపై టాయిలెట్స్ వాడితే డబ్బులు వసూలు చేయనున్నారు. మెట్రో స్టేషన్ లో టాయిలెట్ వాడకానికి రూ.5, యూరినల్ వాడకానికి రూ.2 వసూలు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ చార్జీలను నేటి నుంచే (జూన్ 02) అమలు చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. దీంతో ప్రయాణికులు అసహనానికి లోనవుతున్నారు.