గత ఏడాది కరోనా నేపథ్యంలో వినాయక ఉత్సవాలు పెద్దగా నిర్వహించలేదు. విగ్రహాలకు కూడా ఎక్కువగా అనుమతి ఇవ్వకపోవడం.. వీధుల్లో మండపాలు వేయడానికి ఆంక్షలు విధించడం లాంటివి చేయడంతో సందడి బాగా తగ్గింది. అయితే ప్రతి సంవత్సరం వినాయక చవితి పండుగ వచ్చిందంటే నగర వాసులు ఎంతగా సందడి చేస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.
ముఖ్యంగా ఖైరతాబాద్ వినాయకుడు అంటే నగరవాసులే కాదు.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి సందర్శించుకుంటారు. కానీ గత ఏడాది మాత్రం చిన్నసైజు విగ్రహంతో సరిపెట్టాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే.. నాయక నిమజ్జనాలు, పండుగ ఏర్పాట్ల వ్యవహారంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం అయిన విషయం తెలిసిందే. తాజాగా హుస్సెన్సాగర్లో వినాయకుడి నిమజ్జనాలు చేయోద్దంటూ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హుస్సేన్ సాగర్ లో ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో తయారు చేసిన వినాయక విగ్రహలను నిమజ్జనం చేయవద్దని తెలంగాణ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
మరో వైపు హుస్సేన్ సాగర్ లో రబ్బర్ డ్యామ్ ఏర్పాటు చేసి అందులోనే వినాయక విగ్రహలను నిమజ్జనం చేయాలని కోరింది. ఈ నేపథ్యంలో చిన్న, పర్యావరణహిత విగ్రహాలను ప్రోత్సహించాలని కోర్టు సూచించింది. మట్టి విగ్రహాలను నిమజ్జనం చేసుకోవచ్చని తెలిపింది. దూర ప్రాంతాల నుంచి నిమజ్జనాల కోసం ఒకే రోజు హుస్సేన్ సాగర్కు రాకుండా ప్రణాళికలు ఏర్పాటు చేయాలని కోర్టు సూచించింది. చిన్న విగ్రహాలను ఇళ్లలోనే బకెట్లలో నిమజ్జనం చేసేలా ప్రోత్సహించాలని తెలిపింది.
ట్యాంక్బండ్ పై నిమజ్జనానికి అనుమతించవద్దని కూడా ప్రభుత్వానికి హైకోర్టు తేల్చి చెప్పింది. తమ ఆదేశాలను ప్రభుత్వం, జీహెచ్ఎంసీ , పోలీస్ శాఖలు కచ్చితంగా అమలు చేయాలని కోర్టు ఆదేశించింది. గణేష్ మండపాల వద్ద ఎక్కువ మంది గుమికూడకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరింది హైకోర్టు. రాత్రి 10 గంటల తర్వాత మైకులకు అనుమతిని ఇవ్వవద్దని కూడ తేల్చి చెప్పింది ఉన్నత న్యాయస్థానం. ముఖ్యంగా భక్తులు తప్పకుండా భౌతిక దూరం పాటించాలని.. మాస్క్ తప్పనిసరిగా ధరించాలని.. దగ్గరలో శానిటైజర్ ఏర్పాటు చేయాలని సూచించింది.