సంక్రాంతి పండుగ సమీపించడంతో నగర వాసులంతా పల్లెటూళ్లకు, స్వస్థలాలకు బయలు దేరుతున్నారు. ఉద్యోగాలు, వ్యాపారాల రీత్యా హైదరాబాద్ లో ఉంటున్నవారంతా మూడు రోజులు సెలవులు రావడంతో ఆంధ్రకు పరుగులు పెడుతున్నారు. రైళ్లు, బస్సు మార్గాలు ద్వారా కొందరు చేరుకుంటుండగా.. మరికొందరు సొంత వాహనాల్లో సొంతూళ్లకు వెళుతున్నారు. దీంతో రోడ్లపై వాహనాల రద్దీ పెరిగింది. ట్రాఫిక్ కూడా తీవ్ర స్థాయికి చేరింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో.. కాస్తంతా దూరానికే గంటల గంటల సమయం పడుతోంది.
హైదరాబాద్ నుండి ఆంధ్రకు చేరుకునే రహదారి మార్గాల్లో వాహనాల రద్దీ పరిమితికి మించి పెరిగింది. హైదరాబాద్-విజయవాడ హైవేలోని టోల్ గేట్ల వద్ద వాహనాలు బారులు తీరుతున్నాయి. పతంగి, చిలకల్లుతో సహా పలు టోల్ ఫ్లాజా వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఫాస్టాగ్ ఉన్నప్పటికీ కూడా సరిగ్గా స్కాన్ కాకపోవడంతో మరింత ఆలస్యమౌతోంది. దీంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారు. రాచకొండ పోలీసులు, టోల్ గేట్ సిబ్బంది ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు.
కాగా, శుక్రవారం నుండి వాహనాల రద్దీ మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదు. ఈ రోజు కూడా విధులు నిర్వర్తించి.. అనంతరం సొంతూళ్లకు పయనమ్యేవారున్నారు. దీంతో టోల్ ఫ్లాజా వద్ద భారీగా వాహనాలు చేరుకోనున్నాయి. అయితే టోల్ గేట్ల వద్ద వాహనాలు భారీగా క్యూ కట్టడంపై తెలంగాణ ఆర్టీసీ ఎండి సజ్జనార్ స్పందించారు. సొంత వాహనాల్లో స్వస్థలలాకు వెళ్లాలని భావించే వారంతా..గంటల తరబడి టోల్ గేట్ల వద్ద వేచి ఉండి సమయాన్ని వృథా చేసుకోవద్దని, ఆర్టీసీ బస్సులో ప్రయాణించాలని సూచించారు. ఆర్టీసీ సిబ్బంది మిమ్మల్ని సురక్షితంగా, సౌకర్యవంతంగా, వేగంగా మీ సొంతూళ్లకు చేర్చుతారని అన్నారు.