నగరంలోని ఏవైనా సంస్థలు, మాల్స్, ఆస్పత్రులు ఇలా ఎక్కడైనా సరే నిబంధనలు ఉల్లంఘించినట్లు.. జీహెచ్ఎంసీ అధికారుల దృష్టికి వస్తే.. వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. సాధారణంగా హైదరాబాద్ లోని పెద్ద పెద్ద మాల్స్, ఆస్పత్రులు, సినిమా థియేటర్లలో పార్కింగ్ ఫీజు వసూలు చేయకూడదు. కాదని నిబంధలు ఉల్లంఘిస్తే.. జీహెచ్ఎంసీ అధికారులుకు ఫిర్యాదు చేస్తే.. చర్యలు తీసుకుంటారు. తాజాగా ఓ కార్పొరేట్ ఆస్ప్రతి 20 రూపాయల పార్కింగ్ ఫీజు వసూలు చేసినందుకు.. జీహెచ్ఎంసీ 50 వేల రూపాయల జరిమానా విధించింది. వివరాల్లోకి వెళ్తే..
విజయ్గోపాల్ అనే వ్యక్తి ఈ నెల 15న రోగిని చూసేందుకు వచ్చి తన స్కూటర్ను బంజారాహిల్స్ రోడ్ నెం. 10లోని ఓ కార్పోరేట్ ఆస్పత్రి ఆవరణలో పార్కింగ్ చేశాడు. ఒక అరగంట సేపు అయ్యాక బయటకు వచ్చి తన బైక్ ను తీయబోయాడు. ఇంతలో అక్కడున్న సిబ్బంది పార్కింగ్లో ఉంచినందుకుగాను రూ. 20 ఫీజు వసూలు చేశారు. ఈ విషయాన్ని ఆధారాలతో సేకరించిన విజయ్గోపాల్ సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై స్పందించిన జీహెచ్ఎంసీ సెంట్రల్ ఎన్ఫోర్స్మెంట్ విచారించాక నిజమని తేలడంతో సదరు ఆస్పత్రికి రూ. 50 వేల జరిమానా విధించింది.