చదవు పూర్తయ్యి.. లేక.. మధ్యలో వదిలేసి.. సరైన ఉపాధి అవకాశాలు లేక.. నిరుద్యోగులుగా ఉన్న యువతకు జీహెచ్ఎంసీ శుభవార్త చెప్పింది. వేసవి సెలవులు కావడంతో.. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఉపాధి పొందేలా యువత కోసం సరికొత్త కార్యక్రమాన్ని ప్రకటించింది. ఆ వివరాలు..
యువతకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ హైదరాబాద్ కార్పొరేసన్(జీహెచ్ఎంసీ) శుభవార్త చెప్పింది. వారి కోసం కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలోని మురికివాడల్లో నివసించే ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు, వారి ఆర్థిక పరిస్థితిని మెరుగ పరిచేందుకు రంగం సిద్ధం చేస్తోంది. దీనిలో భాగంగా నగరంలో మురికి వాడల్లో ఉంటున్న యువతీయువకులకు ఉపాధి కల్పించే దిశగా చర్యలు తీసుకుంటుంది. దీనిలో భాగంగా వారికి పలు రంగాల్లో ఉచిత శిక్షణ ఇచ్చి.. ఉపాధి కల్పించే కార్యక్రమాలను రూపొందిస్తోంది. ఈ మేరకు లైట్హౌస్ కమ్యూనిటీ ఫౌండేషన్(ఎల్సీఎఫ్) అనే సంస్థతో జీహెచ్ఎంసీ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సంస్థ ద్వారా ఆర్థికంగా వెనకబడిన వర్గాల నిరుద్యోగ యువతీయువకులకు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చి.. వారు తమ నైపుణ్యాలను మరింత మెరుగు పర్చుకునే అవకాశం కల్పించనుంది.
ఈ సంస్థతో కలిసి.. ఏటా సుమారు 500 మంది యువతీయువకులకు శిక్షణ ఇచ్చి.. ఉద్యోగ అవకాశాలను కల్పించేలా చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ నిర్ణయం తీసుకుంది. ఇక తాజాగా నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా.. హుడా కాలనీలోని జీహెచ్ఎంసీ మోడల్ మార్కెట్ బిల్డింగ్లో ఏర్పాటు చేసిన స్కిల్ ట్రైనింగ్ సెంటర్ను ఒపెన్ చేసిన సంగతి తెలిసిందే. ఎల్సీఎఫ్ సంస్థతో కలిసి.. శేరిలింగంపల్లిలోని చందానగర్లో జీహెచ్ఎంసీ ఈ ట్రైనింగ్ సెంటర్ను ఏర్పాటు చేసింది. పైలట్ ప్రాజెక్ట్గా చేపట్టిన ఈ సెంటర్ నుంచి వచ్చే ఫలితాలను బట్టి.. రానున్న రోజుల్లో.. నగరంలోని 1400 మురికివాడల్లో ఈ ప్రాజెక్టును అమలు చేసే యోచనలో ఉంది. జీహెచ్ఎంసీ పరిధిలో 4,800 కాలనీలు, 1400 నోటిఫైడ్, నాన్ నోటిఫైడ్ మురికివాడలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. త్వరలో ఈ ప్రాంతాల్లో కూడా యువతకు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇవ్వనున్నారు.
ఈ ప్రాజెక్ట్లో భాగంగా.. నిరుద్యోగ యువతీయువకులకు టైలరింగ్, బ్యూటీషియన్, రిటైలర్, పర్సనాలిటీ డెవలప్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్ వంటి వాటిపై ట్రైనింగ్ ఇవ్వనున్నారు. 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న యువతీ,యువకులకు శిక్షణ ఇవ్వనున్నారు. అలాగే అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, సాఫ్ట్వేర్ టెస్టింగ్, వెబ్ డెవలప్మెంట్, నర్సింగ్ అసిస్టెంట్, ఎలక్ట్రీషియన్, బ్యూటీ, వెల్నెస్, జావా, డేటా ఎంట్రీ, బీపీవో, వెబ్ డీజైనింగ్, కంప్యూటర్ హార్డ్వేర్, ఇతర కోర్సుల్లో కూడా నిరుద్యోగ యువతకు శిక్షణ ఇవ్వనున్నారు. ఇప్పటివరకు 150 మందికిపైగా యువత ఈ సెంటర్ ద్వారా శిక్షణ తీసుకోగా.. వారిలో 36 మందికి ఉద్యోగాలు వచ్చాయి.
ఇలా ఉద్యోగాలు పొందిన వారంతా ప్రస్తుతం రూ.12 వేల నుంచి 15 వేల మధ్య సంపాదిస్తున్నారు. లైట్హౌస్ సీఈవో రుచి మాట్లాడుతూ.. యువతను ప్రోత్సహించేందుకు, మంచి కెరీర్ అందించేందుకు ఇలా ఉచిత శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. తమ ఫౌండేషన్ ద్వారా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1.3 లక్షల మంది యువత లబ్ధి పొందినట్లు వెల్లడించారు. అలానే రానున్న రోజుల్లో మరింత మందికి శిక్షణ ఇచ్చే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. మరి జీహెచ్ఎంసీ తీసుకొచ్చిన ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.