భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇంట్లో గ్యాస్ లీకై దంపతులు సహా కుమార్తె సజీవదహనం అయ్యారు. మరో కుమార్తె 80 శాతం కాలిన గాయాలతో పాల్వంచ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. స్థానికుల సమాచారంతో పోలీసులు మంటలను ఆర్పేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
వివరాల్లోకి వెళితే.. పాత పాల్వంచ తూర్పు బజారులో ఈ ఘటన జరిగింది. రామకృష్ణ- శ్రీలక్ష్మి దంపతులకు కవలలు. పాల్వంచలో నివాసముంటున్నారు. అతనికి అక్కడే ఒక మీ సేవా కేంద్రం కూడా ఉంది. దానిని ఇటీవల అమ్మేసి రామకృష్ణ రాజమహేంద్రవరం వెళ్లిపోయాడు. రెండ్రోజుల క్రితమే పాల్వంచ తిరిగి వచ్చాడు. పోలీసులు ఆత్మహత్య అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. రామకృష్ణ కారులో కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ఇది ఆత్మహత్య కూడా అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. రామకృష్ణ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.