తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల వరుసగా కుక్కల దాడులు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా వీధి కుక్కలు ఒంటరిగా ఉంటున్న చిన్న పిల్లలను టార్గెట్ చేసుకొని దారుణంగా దాడులకు తెగబడుతున్నాయి. అంబర్ పేట్ ఘటనలో ప్రదీప్ అనే నాలుగేళ్ల చిన్నారిని కుక్కలు కిరాతకంగా కొరికి చంపిన విషయం తెలిసిందే. ఈ తరహా కుక్కల దాడులు వరుసగా జరుగుతున్నాయని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఈ మద్య వీధి కుక్కలు తెగ రెచ్చిపోతున్నాయి. చిన్న పిల్లలను టార్గెట్ చేసుకొని దాడి చేస్తున్నాయి. హైదరాబాద్ అంబర్ పేట్ లో నాలుగేళ్ల ప్రదీప్ ని అత్యంత కిరాతకంగా వీధి కుక్కలు దాడి చేసి చంపాయి. ఈ ఘటనకు సంబంధించిన దృష్యాలు ప్రతి ఒక్కరిని కలచివేశాయి. ఇలాంటి ఘటనలు జరిగినపుడు ప్రభుత్వం అప్పటికప్పుడు కంటి తూడుపు చర్యలు తీసుకుంటున్నా.. విధి కుక్కల బెడద మాత్రం తొలగించలేకపోతుంది. తాజాగా ఖమ్మంలో మరో దారుణం జరిగింది. ఇంటి ముందు ఆడుకుంటున్న నాలుగేళ్ల చిన్నారిపై కుక్కలు దాడి చేశాయి. వివరాల్లోకి వెళితే..
ఖమ్మం జిల్లా కల్లూరి పట్ణంలో సోమలింగాలరెడ్డి వీధిలో శీలం నాగరాజు దంపతుల కుమార్తె కారుణ్యపై వీధి కుక్కలు దాడి చేశాయి. పాప వయసు నాలుగు సంవత్సరాలు. ఇంటి ఆవరణలో స్నేహితులతో ఆడుకుంటున్న సమయంలో అకస్మాత్తుగా వీధి కుక్కలు కారుణ్యపై దాడి చేసి కరిచాయి. దీంతో బాలికకు తీవ్రంగా గాయాలు కావడంతో స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం బాలిక పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యలు తెలిపారు. తమ పట్టణంలో వీధి కుక్కల బెడద నానాటికీ పెరిగిపోతుందని.. వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఇదిలా ఉంటే.. గ్రేటర్ వరంగల్ లోని కాశీబుగ్గ లో ఓ విద్యార్థిని నడుచుకుంటూ వెళ్తుండగా వీధి కుక్కలు దాడి చేశాయి. బాలిక భయంతో పరుగులు తీయడంతో ప్రమాదం తప్పిందని అంటున్నారు. బాలికను ప్రాథమిక చికిత్స కోసం ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఎండాకాలం కావడంతో అధిక ఉష్ట్రోగ్రత తట్టుకోలేక కొన్ని కుక్కలు పిచ్చిగా మారి చిన్న పిల్లలను టార్గెట్ చేసుకొని దాడులకు పాల్పపడుతున్నాయని అంటున్నారు. చిన్న పిల్లలు స్కూళ్లకు పంపాలన్నా భయం వేస్తుందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.