పోడు భూముల సాగుదారుల దాడిలో ఫారెస్ట్ రేంజ్ అధికారి మృతి చెందిన ఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎర్రబోడు సమీపంలో ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీనివాసరావుపై పోడు భూముల సాగుదారులు మంగళవారం దాడి చేశారు. వేట కొడవళ్లు, కత్తులు, గొడ్డళ్లతో దాడి చేయటంతో ఆయన మృత్యువాతపడ్డారు. ఈ నేపథ్యంలోనే ఫారెస్ట్ సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు కూడా పోలీసుల్లా తుపాకులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. రేపటినుంచి తెలంగాణలోని ఫారెస్ట్ సిబ్బంది విధుల బహిష్కరణకు సిద్ధమయ్యారు.
ప్రభుత్వం స్పందించేంత వరకు సమ్మె ఆపమని అంటున్నారు. ప్రభుత్వం రాత పూర్వకంగా హామీ ఇస్తేనే విధుల్లో చేరతామని స్పష్టం చేస్తున్నారు. పోడు సర్వేలు, గ్రామ సభలతో సహా అన్నింటిని బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. బీట్ ఆఫీసర్ స్థాయినుంచి రేంజ్ ఆఫీసర్ స్థాయి వరకు అందరూ సమ్మెలో పాల్గొంటారని ఓ అధికారి వెల్లడించారు. వాళ్లను వాళ్లు కాపాడుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. కాగా, చంద్రుగొండ మండలం బెండాలపాడు అటవీప్రాంతంలోని ఎర్రబోడు సమీపంలో అటవీశాఖ అధికారులు కొన్ని మొక్కలు నాటారు. ఈ విషయం తెలిసిన పోడు భూముల సాగుదారులు మంగళవారం ఆ ప్రాంతానికి వచ్చారు. వాటిని తొలగించటానికి ప్రయత్నించారు.
వీరిని అడ్డుకునేందుకు ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీనివాసరావు, రామారావు సంఘటనా స్థలానికి వెళ్లారు. ఈ నేపథ్యంలోనే పోడుభూముల సాగుదారులు ఇద్దరిపై దాడి చేశారు. వేటకొడవళ్లు, కత్తులు, గొడ్డళ్లతో విచక్షణారహితంగా నరికారు. ఈ దాడినుంచి రామారావు తప్పించుకోగా.. శ్రీనివాసరావు మాత్రం తీవ్రంగా గాయపడ్డారు. మెడ భాగంలో బలమైన గాయాలు కావడం వల్ల.. తీవ్ర రక్తస్రాయం జరిగింది. చికిత్స పొందుతూ ఆయన మరణించారు. ఇక, అధికారి మృతిపై అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రభుత్వం 50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది.