మనిషికి దేవుడు ప్రాణం ఇస్తే.. ఆ ప్రాణానికి ఏదైనా అపాయం జరిగిదే వైద్యం చేసి మళ్లీ ప్రాణాలు రక్షించే గొప్ప వృత్తి వైద్య వృత్తి. అందుకే వైద్యుడిని దేవుడితో పోలుస్తుంటారు. డాక్టర్ కావడం అనేది సామాన్య విషయం కాదు.. దానికోసం ఎంతో కష్టపడాలి. అందులో సక్సెస్ సాధించేవారు చాలా కొద్దిమంది మాత్రమే ఉంటారు. ఈ మద్య కొంత మంది కంపౌండర్లు, చిన్న చిన్న మూలికా వైద్యం చేసేవారు సైతం దొంగ సర్టిఫికెట్స్ తో డాక్టర్లుగా చలామణి అవుతున్నారు. అలాంటి వారి గుట్టు బయటపెడుతున్నారు పోలీసులు. పదోతరగతి కూడా పాస్ కాకుండా ఏకంగా పదేళ్లుగా డాక్టర్ వృత్తిలో కొనసాగిన ఓ నకిలీ వైద్యుడి బాగోతాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు బయటపెట్టారు. ఈ ఘటన జనగామ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ లో ఆకాశ్ కుమార్ బిశ్వాస్ అనే యువకుడు టెన్త్ ఫెయిల్ అయ్యాడు. ఇకపై తనుకు చదువు అబ్బదని తెలుసుకొని కొంత కాలం ఖాళీగా రోడ్లపై తిరిగాడు. తన తాత ఆయుర్వేద వైద్యుడిగా కొనసాగుతుంటే.. అతని వద్ద పని చేసి మంచి కిటుకులు నేర్చుకున్నాడు. ఎలాంటి సర్టిఫికెట్ లేకుండా వైద్యం చేయడం మొదలు పెట్టాడు. చిన్న చిన్న సమస్యలతో వచ్చేవారికి తనకు తెలిసిన కిటుకులు ప్రయోగించేవాడు. ఇలా పది కూడా పాస్ కాకుండానే స్టెతస్కోప్ పట్టుకుని ఒక సీనియర్ డాక్టర్ లెవెల్లో బిల్డప్ ఇచ్చాడు.
ఆకాశ్ కుమార్ బిశ్వాస్.. శివునిపల్లిలో గ్రామంలో క్లీనిక్ ఏర్పాటు చేశాడు. తన వద్దకు వచ్చే రోగులకు అలోపతి, ఆయుర్వేది మందులతో చికిత్స చేయడం ఆరంభించాడు. తన వద్ద నయం కాని పేషెంట్లను వరంగల్ లోని వివిధ ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లాల్సిందిగా ప్రతిపాదించేవాడు. ఇందుకోసం మంచి కమీషన్ కూడా తీసుకునేవాడు. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా పదేళ్ల పాటు దర్జాగా వైద్యుడిగా చెలామణి అయ్యాడు ఆకాశ్.
ఈ విషయం గురించి టాక్స్ ఫోర్స్ పోలీసులకు తెలియడంతో అతని వద్దకు వెళ్లి సర్టిఫికెట్స్ చూపించాల్సిందిగా కోరారు. తన వద్ద ఏమీ లేవని చెప్పాడు.. ఈ క్రమంలో అతని వద్ద ఉన్న వివిధ పరికరాలు, మందులు, ఔషదాలు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు. సదరు నకిలీ వైద్యుడి గురించి తెలియక వద్దకు రావడంతో బాగానే డబ్బు సంపాదించాడు. పదేళ్లలో దాదాపు 3,650 మందికి చికిత్స అందించినట్లు పోలీసులు తెలిపారు.