తెలంగాణ రాష్ట్రంలో కరెంట్ చార్జీలు పెరగనున్నాయా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఆ దిశగా అడుగులు కూడా వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే భారీగా పెరిగిపోయిన పెట్రోల్, డీజిల్ ధరలతో సతమతమవుతున్న సామాన్యులకు కరెంట్ చార్జీల పెంపుతో మరో షాక్ తగలనుంది. అయితే ఈ పెరగనున్న చార్జీలను వచ్చే సంవత్సరం జనవరి నుంచి అమల్లోకి రానున్నట్లు కూడా తెలుస్తోంది. 2021-22 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం జనవరి, ఫిబ్రవరి, మార్చిలో కరెంట్ చార్జీల సవరణకు వీలుగా పూర్తి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
పెంచబోయే ఈ చార్జీలను కనీసం మూడు నెలల కాలంలో రూ.500 కోట్ల దాకా డిస్కమ్లకు అదనపు ఆదాయం వచ్చేలా పిటిషన్లు దాఖలు చేయనున్నట్లు సమాచారం. అయితే మరో విషయం ఏంటంటే..? ఒకవేళ ఇప్పుడు కరెంట్ చార్జీలు పెంచితే కనుక అన్ని రకాల క్యాటగిరీలో పెంచేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారట అధికారులు. ఇక దీని కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అనుమతి కోసం వేచి చూస్తున్నారు. సుధీర్ఘ కాలం తర్వాత విద్యుత్ చార్జీలు పెంచుతుండడం విశేషం. దీంతో సామన్యుడి నెత్తిన మరో పిడుగుపడునుంది.