జీవితంలో ఓ ఇల్లైనా కట్టుకోవాలని ప్రతి ఒక్కరికీ కోరిక ఉంటుంది. తమ స్థోమతకు తగ్గట్లు ఇళ్లను నిర్మించుకోవాలనుకుంటారు. కాస్తంత భూమి ఉంటే చాలు.. దానికి తగ్గట్లుగా పెంకిటిల్లు,రేకిలిల్లు, చిన్న డాబా అయినా వేసుకుందామనుకుంటారు. అయితే మహబూబాబాద్ కు చెందిన ఓ ఇద్దరు తమ తల్లిదండ్రులకు ఓ ఇళ్లును బహుమతిగా ఇద్దామని భావించారు. అందరిలా కాకుండా.. వినూత్నంగా ఆలోచించి కంటైనర్ హౌస్ ను తయారు చేయించి.. తల్లిదండ్రులకు కానుకగా ఇచ్చారు.
మహబూబాబాద్ జిల్లా కే సముద్రానికి చెందిన హుస్సేన్ కు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. కుమారులు అక్బర్, అఫ్జల్ వృత్తి రీత్యా ఫోటోగ్రాఫర్లు. మమ్నల్ని కని, కష్టపడి పెంచి.. ఓ మార్గం చూపిన తమ తల్లిదండ్రులకు ఓ మంచి ఇళ్లు కానుకగా ఇవ్వాలని భావించిన ఆ ఇద్దరు కుమారులు..వినూత్నంగా ఆలోచించి కంటైనర్ హోంను అందించారు. ఇందులో ఒక హాల్, బెడ్రూమ్, దానికి అటాచ్ బాత్రూం ఉన్నాయి. తల్లిదండ్రులను ఆ ఇంటికి తీసుకెళ్లి చూపించగా.. వారు ఆనందం వ్యక్తం చేశారు. లోపలకి వెళ్లి చూడగా.. ఇదీ ఇల్లేనా అని ఆశ్చర్యపోయారు. వారి కళ్లల్లో ఆనందాన్ని చూసిన కుమారులు సంబర పడిపోయారు.
సాధారణంగా ఓ ఇంటిని నిర్మిచాలంటే సుమారు 12 లక్షల రూపాయల ఖర్చు అవుతుందని, కానీ దీని కోసం తాము రూ. 5 లక్షలు వెచ్చించినట్లు కుమారులు తెలిపారు. దీన్ని హైదరాబాద్ లో తయారు చేయించామని, తమ తల్లిదండ్రుల రుణం తీర్చుకునేందుకు తాము ఈ ఇంటిని బహుమతిగా ఇచ్చినట్లు చెప్పారు. వారికి సొంత ఇళ్లు ఉండాలని తాము భావించి .. దీన్ని కానుకగా అందించామన్నారు. ఈ ఇల్లు 25 సంవత్సరాల పాటు చెక్కు చెదరదని అప్జల్ వెల్లడించారు.