సినీ, రాజకీయ సెలబ్రిటీలను కలవడం అంత చిన్న విషయం కాదు.. చాలా మందికి సాధ్యపడదు. గతంలో అయితే వారిని కలవడం కోసం రోజుల తరబడి సెలబ్రిటీల ఇళ్ల వద్ద పడిగాపులు కాసే వారు అభిమానులు. అయితే సోషల్ మీడియా పుణ్యమా అని సామాన్యుల కష్టాలు, కలలు వెంటనే సెలబ్రిటీలకు తెలుస్తున్నాయి. వారు కూడా తక్షణమే స్పందించి అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈ విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్, ఆయన తనయుడు, ఐటీ మినిస్టర్ కేటీఆర్ ఓ అడుగు ముందుంటారు. కొన్ని రోజుల క్రితం కేటీఆర్ ట్యాంక్బండ్ శివ ఇంటికి వస్తాను అని మాట ఇవ్వగా.. తాజాగా కేసీఆర్ మరో అభిమాని కల నెరవేర్చి.. అందరి చేత ప్రశంసలు పొందుతున్నారు.
తెలంగాణ రాష్ట్రం సాధించిన నేతగా కేసీఆర్ అంటే చాలా మందికి విపరీతమైన అభిమానం. ఎంతలా అంటే.. తమ సంతానానికి ఆయన పేరు పెట్టుకున్న వారు కోకొల్లలు. ఇక ఆయనను కలవాలని భావించేవారి సంఖ్య కూడా చాలా ఎక్కువే. ఇదుగో ఇలాంటి కోరిక ఉన్న ఓ ఉద్యమకారుడి తొమ్మిదేళ్ల కల నెరవేర్చారు సీఎం కేసీఆర్. ఆ వివరాలు..
భూపాలపల్లి మండలం నందిగామ గ్రామానికి చెందిన సురేశ్ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పని చేశాడు. అతడికి సీఎం కేసీఆర్ అంటే విపరీతమైన అభిమానం. ఈ క్రమంలో సురేష్, అనిత దంపతులకు 2013లో కుమార్తె జన్మించింది. అయితే.. తమ పాపకు కేసీఆర్ పేరు పెట్టాలని ఆ దంపతులు కోరుకున్నారు. కానీ సీఎంని కలిసే అవకాశం లభించలేదు. చివరకు ఈ విషయం తెలసుకున్న సీఎం కేసీఆర్.. సురేశ్, అనిత దంపతులను ఇంటికి ఆహ్వానించారు. అనంతరం వారికి అతిథి మర్యాదలు చేసి.. వారి తొమ్మిదేళ్ల పాపను దీవించి.. చిన్నారికి ‘మహతి’ అని పేరు పెట్టారు. అంతేకాక తమ ఇంటికి వచ్చిన సురేష్ దంపతులకు.. సీఎం కేసీఆర్, ఆయన భార్య శోభ బట్టలు పెట్టి.. సాంప్రదాయ పద్దతిలో ఆథిత్యమిచ్చారు. అంతేకాక సురేష్ బిడ్డ చదువుకోసం ఆర్థిక సాయాన్నందించారు.
ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ.. ‘‘మా బిడ్డకు సీఎం కేసీఆర్ గారి చేత పేరు పెట్టించుకోవాలనేది మా తొమ్మిదేళ్ల కల. నేడు అది నెరవేరింది. కేసీఆర్ మా బిడ్డకు పేరు పెట్టి ఆశీర్వదించారు. అంతేకాక మమ్మల్ని ఎంతో బాగా ఆదరించి.. బట్టలు కూడా పెట్టడం మా అదృష్టంగా భావిస్తున్నాం. మా కల నెరవేరేందుకు సహకరించిన మాజీ స్పీకర్ మధుసూదనాచారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను’’ అన్నారు. కేసీఆర్ పనిపై జనాలు ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
తమ బిడ్డకు పేరు పెట్టుకోవాలనే ఆ తల్లిదండ్రుల తొమ్మిదేండ్ల కల సీఎం శ్రీ కేసీఆర్ చేతుల మీదుగా ఫలించింది. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పనిచేసిన భూపాలపల్లి మండలం, నందిగామ గ్రామానికి చెందిన సురేశ్, అనిత దంపతులు 2013 లో ఆడ బిడ్డకు జన్మనిచ్చారు. pic.twitter.com/TTILqhWEE4
— Telangana CMO (@TelanganaCMO) September 18, 2022