మార్నింగ్ టిఫిన్ అనగానే మనకు గుర్తుకు వచ్చేది.. ఇడ్లీ, దోశ, ఉప్మా. అయితే చాలా మంది ఇడ్లీని పెద్దగా ఇష్టపడరు. కానీ దోశ చాలా మందికి ఫేవరెట్ టిఫిన్. ఇక దోశలో కూడా రకరకాల వెరైటీలు అందుబాటులో ఉన్నాయి. కారం దోశ, మసాల దోశ, ఉల్లిపాయ దోశ, పన్నీర్ దోశ, ఉప్మా దోశ, 70 ఎంఎం దోశ. చెప్పుకుంటూ పోతే ఈ లిస్ట్ చాంతడంతా అవుతుంది. ఈ జాబితాలో తాజాగా గులాబీ దోశ చేరింది. దాని ఖరీదు కూడా కేవలం 1 రూపాయి మాత్రమే. భోజనప్రియులను అలరిస్తోన్న ఈ గులాబీ దోశ వివరాలు..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో ఈ గులాబీ దోశ ప్రాణం పోసుకుంది. తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలో పువ్వాడ యువజన సంఘం ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నాయకులు రూపాయికే గులాబీ దోశ కార్యక్రమాన్ని ప్రారంభించారు. బీట్ రూట్ కలపడంతో ఈ దోశ గులాబీ రంగులో వచ్చింది. దీన్ని కేవలం 1 రూపాయికే స్థానికులకు అందించారు టీఆర్ఎస్ నాయకులు. పార్టీ జెండా రంగులో దోశ లభిచండంతో.. కార్యకర్తలు దీని కోసం ఎగబడ్డారు. ఈ వెరైటీ దోశపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.