చదువుకుని.. నాగరికత తెలిసి.. విచక్షణా జ్ఞానం ఉన్న మనుషులే.. తెలిసి కూడా ఎన్నో తప్పులు చేస్తారు. మరీ ముఖ్యంగా సివిక్ సెన్స్ ఏమాత్రం ఉండదు. రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ ఉమ్మివేయడం.. చెత్త పడేయడం.. మల మూత్ర విసర్జన చేయడం వంటివి చేస్తారు. నలుగురు చూస్తారు.. అనే సిగ్గు, శరం ఏమాత్రం లేకుండా.. పని కానిచ్చేస్తారు. బుద్ధి, జ్ఞానం ఉన్న మనుషులే ఇలా ప్రవర్తిస్తే.. ఇక మూగజీవాలు చేసే పనులు నేరం అంటే ఎలా. కానీ ఓ చోట అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి.. ఎద్దు రోడ్డు మీద మూత్ర విసర్జన చేసిందని.. దాని యజమాని మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వార్త తెలిసిన వాళ్లు.. ఇదెక్కడి చోద్యంరా నాయనా.. మీరేం అధికారులు అంటూ తలలు పట్టుకుంటున్నారు. ఈ విచిత్ర సంఘటన తెలంగాణ, కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాలు..
పల్లెటూర్లు అంటేనే పశువులు, గొర్రెలు, మేకలు, బర్రెలు, కోళ్లు వంటివి కనిపిస్తాయి. ఇష్టారీతినా తిరుగుతుంటాయి. ఇక మన రైతన్నలు.. బర్రె, పశువుల మలమూత్రాలను ఎరువుగా వినియోగిస్తారు. ఇవి భూమికి ఎంత సత్తువ కలిగిస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ మూగజీవులు.. పైగా వాటి శరీరంలో జరిగే జీవక్రియలు మనుషుల మాదిరి కంట్రోల్లో ఉండవు. కనుక మలమూత్ర విసర్జన ఎక్కడ పడితే అక్కడ చేస్తాయి. ఇది సర్వసాధారణ విషయం. దీన్ని ఎవరు పెద్ద తప్పుగా భావించరు.
కానీ సింగరేణి సిబ్బంది మాత్రం ఈ విషయంలో కాస్త అతిగా ప్రవర్తించారు. సింగరేణి జిఎం ఆఫీస్ ముందు ఒక ఎద్దు మూత్రం పోసిందని.. దాని యజమాని మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు అధికారులు. ఇంకేముంది పోలీసులు కేసు ఫైల్ చేసి కోర్టుకి సబ్మిట్ చేశారు. కోర్టు ఆ రైతుకు వంద రూపాయలు అపరాధ రుసుం విధించింది. ఎద్దుల బండితో సామాన్లు తరలిస్తూ జీవనం పోసుకుంటున్న తనకు ఇలా ఫైన్ విధించడం, శిక్షలు వేయడం ఏంటని ఆవేదన వ్యక్తం చేశాడు సదరు రైతు.
అతడి బాధ అర్థం చేసుకున్న ఓ పోలీస్ కానిస్టేబుల్.. స్థానిక ఇల్లందు మున్సిపల్ మేజిస్ట్రేట్ కోర్టులో అతని తరఫున ఫైన్ చెల్లించి రసీదు ఇవ్వడం జరిగింది. ఈ విషయం తెలిసిన జనాలు.. చేసే పనులు సరిగా చేయరు.. కానీ ఇలాంటి పనికి మాలిన విషయాల్లో అత్యుత్సాహం చూపడం ఏంటని చర్చించుకుంటున్నారు.