పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో తెలంగాణ హైకోర్టు గురువారం విచారణ జరిపింది. బండి సంజయ్ చేసిన తప్పేంటో చెప్పాలని ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది.
టెన్త్ క్లాస్ క్వశ్చన్ పేపర్ లీకేజీ కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఆయన అరెస్టుతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ కేసులో బండి సంజయ్ రిమాండ్ను రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైన విషయం విదితమే. 41ఏ నోటీసు ఇవ్వకుండా ఆయన్ను ఎలా అరెస్ట్ చేశారంటూ.. హనుమకొండ కోర్టు విధించిన రిమాండ్ రద్దు మీద అత్యవసర విచారణ జరపాలని కోర్టును కోరారు. బండి సంజయ్ తరఫున వాదిస్తున్న న్యాయవాదుల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు సీజే జస్టిస్ ఉజ్జల్ భుయాన్.. ఇవాళ మధ్యాహ్నం విచారణను జరిపారు.
కరీంనగర్ నుంచి వరంగల్కు తీసుకెళ్లేందుకు బండి సంజయ్ను 300 కిలోమీటర్లు తిప్పారని ఆయన తరఫు న్యాయవాది రామచంద్రరావు న్యాయస్థానానికి తెలియజేశారు. సంజయ్ మీద ఉన్న ఆరోపణలు ఏంటని హైకోర్టు రాష్ట్ర సర్కారును ప్రశ్నించింది. ప్రశ్నాపత్రం బయటకు వచ్చాక వాట్సాప్లో సర్క్యులేట్ చేశాడే తప్ప.. పేపర్ లీకేజీలో ఆయనకు ప్రమేయం ఎక్కడుందని క్వశ్చన్ చేసింది. ప్రశ్నాపత్రం పబ్లిక్ డొమైన్లోకి వచ్చిన తర్వాత అది లీకేజ్ ఎలా అవుతుందని కోర్టు ప్రశ్నించింది. క్వశ్చన్ పేపర్ లీకై బయటకు వచ్చిన తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా ఈ అంశాన్ని ఎలాగైనా వాడుకోవచ్చని కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్.. బండి సంజయ్ పేపర్ లీకేజీలో కుట్రదారుడు అన్న విషయం తేలిందని చెప్పారు.
ప్రశాంత్కు, బండి సంజయ్కు మధ్య టెలిఫోన్ సంభాషణ జరిగిందని అడ్వకేట్ జనరల్ అన్నారు. కానీ సంజయ్ ఇంకా తన మొబైల్ ఫోన్ను ఇవ్వలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇరు పక్షాల వాదనల అనంతరం ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. ఈ కేసులో తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఈలోగా బండి సంజయ్ బెయిల్ పిటిషన్ వేసుకోవచ్చని కోర్టు తెలిపింది. అయితే ఇప్పటికే కింది కోర్టులో బెయిల్ పిటిషన్ వేశామని బండి సంజయ్ తరఫు న్యాయవాది రామచంద్రరావు చెప్పారు. ప్రధాని మోడీ విజిట్ నేపథ్యంలో సంజయ్పై కింది కోర్టు ఇచ్చిన రిమాండ్ రిజెక్ట్ చేయాలని ఆయన కోరారు. అయితే కింది కోర్టులో బెయిల్ రాకపోతే హైకోర్టులో హౌజ్ మోషన్ పిటిషన్ వేసుకోవాలని సూచించింది. రిమాండ్ క్వాష్ పిటిషన్పై విచారణను ఈ నెల 10వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.