చెడ్డీ గ్యాంగ్.. ఈ పేరు చెబితేనే జనాల్లో ఓ రకమైన భయం కలుగుతుంది. అర్ధరాత్రి సమయంలో దొంగతనాలకు పాల్పడుతూ జనాలను భయాందోళనకు గురి చేస్తుంది ఈ ముఠా. కొన్ని నెలల క్రితం రెండు తెలుగు రాష్ట్రాల పోలీసులకు కంటిమీద కునుకులేకుండా చేసింది ఈ చెడ్డీ గ్యాంగ్. దొంగతనం చేసే సమయంలో ఎవరైన అడ్డు వస్తే హత్య చేయడానికి కూడా వెనుకాడటం లేదు ఈ ముఠా. పోలీసులు తీసుకున్న చర్యలతో గత కొంతకాలం నుంచి చెడ్డీ గ్యాంగ్ దోపిడీలు కనిపించలేదు. అయితే తాజాగా మరోసారి తెలంగాణ రాష్ట్రంలో చెడ్డీ గ్యాంగ్ హల్ చల్ చేస్తుంది. మహబూబ్ నగర్ జిల్లాలో చెడ్డీ గ్యాంగ్ కదలికలు కనిపించాయి. పట్టణంలోని సీసీ కెమెరాలో చెడ్డీ గ్యాంగ్ కదలికలు నమోదయ్యాయి. చాలా కాలం తరువాత మళ్లీ ఈ గ్యాంగ్ నగరంలో సంచరిస్తుండటంతో జనాలు భయాందోళనకు గురవుతున్నారు.
చాలా కాలం తరువాత తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ చెడ్డీ గ్యాంగ్ హల్ చల్ చేసింది. ఉమ్మడి పాలమూరు జిల్లా కేంద్రమైన మహబూబ్ నగర్ పట్టణంలో చెడ్డీ గ్యాంగ్ కదకలికలు కనిపించాయి. దీంతో నగరంలోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ చెడ్డీ గ్యాంగ్ బృందావన్ కాలనీలో వరుస చోరీలకు పాల్పడుతూ నగర ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఇటీవలే నాలుగు రోజుల క్రితం ఓ ఇంట్లో చోరీ చేసి.. భారీగా నగదు, బంగారం ఎత్తుకెళ్లారు. గతంలో కూడా ఇదే కాలనీలోని ఓ ఇంట్లో చోరీకి చెడ్డీ గ్యాంగ్ తీవ్రంగా ప్రయత్నించారు. అయితే ఆ ఇంటి తలుపు ఎంత ప్రయత్నించిన తెరుచుకోక పోవడంతో అక్కడి నుంచి వెనుతిరిగారు.
అర్ధరాత్రి సుమారు 2 నుంచి 3 గంటల సమయంలో ఇళ్లలోకి చొరబడి హల్ చల్ చేస్తుండటంతో మహబూబ్ నగర్ పట్టణ ప్రజలు భయాందోళకు గురవుతున్నారు. ఇంటికి తాళం వేసి బయటకి వెళ్లాలంటనే భయ పడుతున్నారు. ఈ వరుస దొంగతనాలపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దొంగతనానికి వెళ్లిన చెడ్డీ గ్యాంగ్ వీడియోలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. వాటి ఆధారంగా ఆ దొంగల ముఠాను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇటీవలే కాస్త దొంగతనాలు తగ్గాయి అనుకుంటే.. మళ్లీ చెడ్డీ గ్యాంగ్ హల్ చల్ చేయడంతో ప్రజలను కలవర పాటుకు గురి చేస్తుంది. ప్రస్తుతం చెడ్డీ గ్యాంగ్ చోరీల ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.