బిర్యానీ అనగానే మొదటగా గుర్తుకొచ్చేది హైదరాబాద్. మహానగరంలో తయారు చేసే బిర్యానీకి ఫుల్ డిమాండ్ ఉంటుంది. సామాన్యుడి నుంచి మొదలుకుని సెలబ్రెటీల వరకు ఇక్కడి బిర్యానీపై మనస్సు పారేసుకుంటుంటారు. హైదరాబాద్ కు వచ్చే ప్రముఖులు బిర్యానీ తినకుండా ఉండలేరు. ఇప్పుడున్న బిర్యానీ ధరలు త్వరలోనే పెరుగుతాయనే ప్రచారం జరుగుతోంది. అంతేగాదు రుచి కూడా మారుతుందనే వార్తలు గుప్పుమంటున్నాయి. దీనకంతంటికీ కారణం అప్ఘాన్ లో నెలకొన్న సంక్షోభం కారణమంటున్నారు.
బిర్యానీకి అఫ్గానిస్తాన్కు అవినాభావ సంబంధం ఉంది. హైదరాబాద్ బిర్యానీలో వినియోగించే డ్రైఫ్రూట్స్, మసాలా దినుసులు ఎక్కువగా అక్కడి నుంచే దిగుమతి అవుతుంటాయి. దీంతో ఇప్పుడు అఫ్ఘానిస్థాన్ను తాలిబన్లు ఆక్రమించుకోవడంతో ఇండియాకు దిగుమతులు నిలిచిపోనున్నాయి. అఫ్ఘానిస్థాన్ పరిస్థితులు ఇలాగే మరికొంత కాలం కొనసాగితే బిర్యానీ రేట్లు పెంచక తప్పదంటున్నారు హైదరాబాద్ హోటళ్ల నిర్వాహకులు. బిర్యానీలో ఉపయోగించే వంటసామాగ్రీలో మసాల కీలకం. డ్రైఫ్రూట్స్ కీలక పాత్ర పోషిస్తాయి. అత్తి, జీడిపప్పు, పిస్తాపప్పు, అల్మండ్, ఎండుద్రాక్షలు బిర్యానీ తయారీలో ఉపయోగిస్తారు. ఈ డ్రై ఫ్రూట్స్ లో అధికభాగం అప్ఘానిస్తాన్ నుంచి దిగుమతి అవుతున్నాయి.
అప్ఘాన్ లో నెలకొన్న సంక్షోభం కారణంగా ఎగుమతి దారులతో సంబంధాలు తెగిపోయాయి. తాలిబన్ల రాకతో అక్కడ అశాంతి నెలకొంది. ఇదే పరిస్థితి కొన్ని రోజులు కొనసాగితే డ్రై ఫ్రూట్స్ కొరత ఏర్పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఫలితంగా వీటి ధరలు పెరగవచ్చని అనుకుంటున్నారు. తత్ఫలితంగా రుచీ మారే అవకాశమూ లేకపోలేదనే వార్తలు గుప్పుమంటున్నాయి