సాధారణంగా భక్తితో దేవుడికి మొక్కులు చెల్లించుకుంటే తమకు మంచి జరుగుతుందని అందరూ భావిస్తుంటారు. ముడుపులు కట్టి తమ ఇష్ట దైవానికి చెల్లించుకుంటారు. భారత దేశంలో దైవ భక్తి.. దైవ చింతన కలిగినవారు ఎక్కువగా ఉంటారు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలోని ‘ఖాందేవ్’ ఆలయంలో ఓ ఆదివాసీ మహిళ ‘నూనె మొక్కు’ చెల్లించుకుంది. తొడసం వంశీయుల సమక్షంలో మట్టి పాత్రలో 2.5 కిలోల నువ్వుల నూనెను ఒకేసారి తాగింది. మంగళవారం (జనవరి 18) ఖాందేవ్ జాతర సందర్భంగా వందలాది ఆదివాసీలు ఆలయానికి తరలివచ్చారు.
ప్రతీ ఏటా పుష్య మాసంలో జరిగే ఖాందేవ్ జాతరలో తొడసం వంశీయుల ఆడపడుచు ఇలా నూనె మొక్కు చెల్లించుకోవడం ఆచారంగా వస్తోంది. తొడసం వంశీయుల ఆడపడచు యోత్మభాయి ‘నూనె మొక్కు’ చెల్లించింది. ఖాందేవ్ మహా పూజ కోసం తొడసం వంశంలోని ప్రతీ ఇంటి నుంచి నువ్వుల నూనెను తీసుకొస్తారు. మట్టి పాత్రలో సేకరించి తొడసం ఆడపడుచు సేవించడం ఇక్కడి ఆదివాసీలు అనాదిగా పాటిస్తున్న ఆచారం. ఒకసారి నూనె మొక్కును చెల్లించే ఆదివాసీ మహిళ.. వరుసగా మూడేళ్ల పాటు ఆ మొక్కును చెల్లించాల్సి ఉంటుంది. గత మూడేళ్ల పాటు యాధవి అవంతి భాయ్ (38) అనే ఆదివాసీ మహిళ ఈ మొక్కు చెల్లించారు.
ఇది చదవండి : బీజేపీలోకి ములాయం సింగ్ కోడలు.. ఎవరీ అపర్ణ యాదవ్!
ఇక ఆదివాసీల ఆరాధ్య దైవాల్లో ఖాందేవ్ ఒకరు. ఖాందేవ్ దేవుడినే ‘పులి దేవుడు’గా పిలుస్తారు. నార్నూర్ మండల కేంద్రంలో ఉన్న ఖాందేవ్ ఆలయంలో.. దేవతామూర్తి ప్రతిమ పులి ఆకారంలో ఉంటుంది. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్ల నుంచి పెద్ద సంఖ్యలో ఆదివాసీలు జాతరకు తరలివస్తారు. ఈ జాతర ఈ నెల 30 వరకు జరగనుంది. ప్రస్తుతం కోవిడ్ నేపథ్యంలో తగిన జాగ్రత్తలు పాటిస్తూ జాతర నిర్వహిస్తున్నారు.