Sangareddy: సాధారణంగా ఎవరైనా బ్యాంకు నుండి అప్పు తీసుకున్నారంటే.. అది తిరిగి చెల్లించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంటుంది. కానీ.. బ్యాంకు ఇచ్చిన అప్పును తిరిగి ఇవ్వలేక ఓ రైతు ఏకంగా ఊరే వదిలివెళ్లిన ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా, అందోల్ మండల పరిధిలోని కంసాన్పల్లి గ్రామానికి చెందిన ఆశిరెడ్డిగారి శంకర్ రెడ్డి అనే రైతుకు 3.31 ఎకరాల పొలం ఉంది.
2016లో తన పొలంలో బోరు మోటర్, పైపులైన్ ఏర్పాటు కోసం జోగిపేట కోఆపరేటివ్ బ్యాంకు నుండి రూ.80 వేల రుణం తీసుకున్నాడు. అనుకున్నంతగా పంట దిగుబడులు రాకపోవడంతో.. ఇతరుల పొలాలను కౌలుకు తీసుకుని సాగుచేశాడు. అయినా దిగుబడులు రాకపోవడంతో బ్యాంకు అప్పును తీర్చే మార్గం కనిపించలేదు. బ్యాంకు అధికారులు ఒత్తిడి చేయడంతో వేరేచోట రూ.40 వేలు అప్పుచేసి చెల్లించాడు.
ఈ క్రమంలో ప్రభుత్వం పంట రుణాలను మాఫీ చేస్తుందనే ఆశతో ఎదురు చూశాడు. అయినా లాభం లేకుండా పోయింది. చివరికి చేసిన అప్పు రూ.1.42 లక్షలకు చేరింది. అప్పులు తీర్చడం కోసం ట్రాక్టర్ కూడా అమ్మేశాడు. ప్రస్తుతం వేసిన మొక్కజొన్న కూడా చేతికి రాకుండా పోయింది. బ్యాంకు నుండి అధికారులు పదే పదే ఇంటి చుట్టూ తిరుగుతూ నోటీసులు ఇవ్వడం మొదలుపెట్టారు. ఇక గ్రామంలో బకాయి ఉన్నట్లు పోస్టర్లు అంటించి.. ఈ నెల 23న శంకర్ రెడ్డి భూమి వేలం వేయనున్నట్టు అధికారులు ప్రకటించారు. బ్యాంకు అధికారులు అలా ఊర్లో పోస్టర్లు అంటించడంతో శంకర్ రెడ్డి మనస్తాపానికి గురయ్యాడు.
ఈ నేపథ్యంలో బ్యాంకు రుణం చెల్లించలేక, బ్యాంకు అధికారుల వేధింపులు తట్టుకోలేక, రుణం తీర్చేందుకు వేరే మార్గం లేకపోవడంతో రైతు శంకర్రెడ్డి కుటుంబం బతుకుదెరువు కోసం పటాన్ చెరువు శివారు ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఇదిలా ఉండగా.. ఈ విషయంపై బ్యాంకు మేనేజర్ మాట్లాడుతూ.. ‘శంకర్ రెడ్డి ఇంకా రూ.1.42 లక్షలు బకాయి ఉన్నారు. ఈ నెల 23వ తేదీన ఆయన భూమిని వేలం వేస్తున్నట్లు ప్రకటన ఇచ్చాం. బకాయిలో 70 – 80% చెలిస్తే ఇంకొంత గడువు ఇవ్వడానికి సిద్ధంగాఉన్నామని చెప్పాము. ఇలా పాత బకాయిలు పేరుకుపోవడంతో కొత్త రుణాలు ఇవ్వలేకపోతున్నాం. నిబంధనల ప్రకారమే రైతుకు నోటీసులు జారీ చేశాం’ అని తెలిపినట్లు సమాచారం.