మండుతున్న పెట్రోల్ రేట్లకి వినియోగదారుడి కడుపు మండుతోంది. దీంతో ప్రత్యామ్నాయంగా విద్యుత్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. కాస్ట్ ఎక్కువైనా గానీ పెట్రోల్ రేట్లతో పోలిస్తే ఛార్జింగ్ కి అయ్యే ఖర్చు తక్కువని కొనేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. అయితే ఆ ఉత్సాహం నీరు కారుస్తూ బ్యాటరీ వాహనాలు పేలిపోతున్నాయి. గతంలో ఓలా, బజాజ్, మరికొన్ని ఇతర కంపెనీలకు చెందిన విద్యుత్ వెహికల్స్ పేలిపోయిన సంఘటనలు చూశాం. తాజాగా సికింద్రాబాద్ రూబీ హోటల్ లోని రూబీ ఎలక్ట్రిక్ వెహికల్ షోరూంలో వెహికల్స్ పేలిపోయాయి. బ్యాటరీలపై ఒత్తిడి పడడం వల్ల పేలుడు సంభవించిందా? లేక బిల్డింగ్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం సంభవించిందా? అనే విషయం తేలాల్సి ఉంది.
ఒకవేళ బ్యాటరీ పేలడం వల్లనే ఈ ప్రమాదం జరిగి ఉంటే గనుక ఖచ్చితంగా సిట్టింగ్ వేసి దీని మీద చర్చ జరపాల్సిందే. అయితే ఎవరో సిట్టింగ్ వేస్తారు, ఎవరో చర్చ చేస్తారు, ఎవరో మనకేదో చేస్తారు అని కాకుండా మనమే దీని గురించి ఆలోచించడం మొదలుపెడితే మంచిది. బ్యాటరీని ఫోన్ ని యూజ్ చేసినట్టు యూజ్ చేయకుండా.. ఒక పధ్ధతి ప్రకారం యూజ్ చేస్తే పేలుళ్ల నుంచి బ్యాటరీని, వెహికల్ ని, చుట్టూ ఉన్న పరిసరాలను, మనుషులను కాపాడుకోవచ్చు. ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ కంపెనీలు బీఎంఎస్ కి ప్రాధాన్యతనిస్తాయి. బీఎంఎస్ అంటే బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టం. బ్యాటరీలోని అన్ని విభాగాలకు అనుసంధానించబడి ఉంటుంది. ఛార్జింగ్, బ్యాటరీ సామర్థ్యంతో పాటు ఇతర పరిమితులను లెక్కించడంలో బీఎంఎస్ సహాయపడుతుంది. వోల్టేజ్ హెచ్చుతగ్గులకు అనుగుణంగా విద్యుత్ సరఫరా ఎలా ఉంటుందో ఈ బీఎంఎస్ సూచిస్తుంది. ఈ బీఎంఎస్ సరిగా లేకపోతే బ్యాటరీలు పేలే అవకాశాలు అధికంగా ఉంటాయి.
పెట్రోల్ వెహికల్స్ ని ఎలా వాడినా పెద్ద సమస్య ఉండదు. కానీ ఎలక్ట్రిక్ వెహికల్స్ ని మాత్రం చాలా జాగ్రత్తగా వాడాలి. పెట్రోల్ వెహికల్స్ లా ఇష్టమొచ్చినట్టు యూజ్ చేయడానికి వీల్లేదు. నిజం చెప్పాలంటే అనుక్షణం ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి ఆలోచిస్తూ ఉండాలి. కన్న పిల్లల్ని చూసుకున్నట్టు వీటిని కూడా కంటికి రెప్పలా చూసుకోవాలి. ఇంత కర్మ అవసరమా అనుకునేవాళ్లు బాబూ నీకో నమస్కారం అని ఎలక్ట్రిక్ వెహికల్స్ జోలికి పోరు. కానీ ప్రకృతి ప్రేమికులు ఉంటారు. తమ వల్ల పర్యావరణం పాడవ్వకూడదు అని అనుకునేవారు ఎంత రిస్క్ అయినా సరే తీసుకుంటారు. ఇక్కడ రిస్క్ అనేది నిర్లక్ష్యం వల్ల వస్తుంది. మొదటి నుంచి నిర్లక్ష్యంగా కాకుండా.. రెస్పాన్సిబుల్ గా ఫీలైతే పర్యావరణ ప్రేమికులకు తిరుగే ఉండదు. పర్యావరణ ప్రేమికుల దృష్టిలో ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటే నచ్చి కొనుక్కునే బాధ్యత, దాని ధర మోయాలనిపించే బరువు. కానీ ఎలక్ట్రిక్ వెహికల్ అంటే మర్చిపోలేని జ్ఞాపకం.
కంపెనీలు ఎలక్ట్రిక్ వెహికల్స్ ని తయారుచేసినప్పటి నుంచి కస్టమర్ చేతికి అందించే వరకు చాలా జాగ్రత్తలు పాటిస్తారు. కంపెనీ ఎలా అయితే జాగ్రత్తలు, భద్రతా ప్రమాణాలు పాటించిందో అలా కస్టమర్లు కూడా వెహికల్ ని కొన్న తర్వాత జాగ్రత్తలు, సేఫ్టీ మెజర్స్ తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే బ్యాటరీలు పేలే అవకాశం ఉంది.
మరి ఎలక్ట్రిక్ వెహికల్స్ పేలిపోవడానికి ఇవి కాకుండా ఇంకేమైనా కారణాలు మీకేమైనా తెలిస్తే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీరు ఎలక్ట్రిక్ వెహికల్స్ ని వాడుతుంటే గనుక, మీరు ఎక్స్ పర్ట్ అయితే గనుక మీ స్వీయ అనుభవాలను నెటిజన్లతో పంచుకోండి. కొత్తగా ఎలక్ట్రిక్ వెహికల్ కొనాలనుకునేవారికి గైడెన్స్ ఇవ్వండి.