దేశ సాంకేతికరంగంలో మరో నూతన అధ్యాయానికి అంకురార్పణ జరిగింది. ఎన్నాళ్లుగానో ఊరిస్తోన్న 5జీ సేవలు నేటి నుంచి అందుబాటులోకి రానున్నాయి. శనివారం నాడు ఇండియా మొబైల్ కాంగ్రెస్ను ప్రారంభించిన మోదీ… 5జీ సేవలను అధికారికంగా ఆవిష్కరించారు. వినియోగదారుల కోసం టెలికం సంస్థలు అక్టోబర్ నెలాఖరు నుంచి కమర్షియల్ 5జీ నెట్వర్క్ను అందుబాటులోకి తీసుకురానున్నాయి. అయితే ముందుగా ఎంచుకొన్న కొన్ని మెట్రో నగరాల్లోని వినియోగదారులకు 5జీ నెట్వర్క్ అందుబాటులోకి వస్తుంది. తొలుత రియలన్స్ జియో, ఎయిర్టెల్ ఈ నెలాఖరులోగా 5జీ నెట్వర్క్ను కమర్షియల్గా లాంచ్ చేస్తాయి. ముందుగా కొన్ని మెట్రో నగరాల్లోనే 5జీ సర్వీసులు అందుబాటులోకి వస్తాయి.
ఇక ఇండియా కాంగ్రెస్ ఆరో ఎడిషన్ని మోదీ శనివారం ప్రారంభించారు. అనంతరం 5జీ సర్వీస్లను అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ, రిలయన్స్ జియో సీఈవో ఆకాశ్ అంబానీ, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక 5జీ పనితీరు గురించి.. టెలికం, వైద్య, పారిశ్రామికం పాటు వివిధ రంగాల్లో 5జీ నెట్వర్క్ వల్ల జరగబోయే మార్పుల గురించి ఆకాశ్ అంబానీ ప్రధానికి వివరించారు.
4జీతో పోలిస్తే 5జీ నెట్వర్క్లో ఇంటర్నెట్ 7-10రెట్లు వేగంగా ఉండనుందనే అంచనాలు ఉన్నాయి. రానున్న రెండు సంవత్సరాల్లోగా దేశమంతా 5జీ నెట్వర్క్ను అందించాలని టెలికం సంస్థలు టార్గెట్గా పెట్టుకున్నాయి. ఇక 5జీ వార్లో రిలయన్స్ జియో, ఎయిర్టెల్ తీవ్రంగా పోటీ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటున్నారు టెలికాం రంగ నిపుణులు. ఇప్పటికే ఈ రెండు కంపెనీలు టారిఫ్స్ దగ్గరి నుంచి 5జీని విస్తరించే వరకు పోటాపోటీగా ముందుకు సాగేందుకు సిద్ధమవుతున్నాయి. 5జీ యూజర్ల బేస్ను పెంచుకునేందుకు వ్యూహాత్మకంగా దూసుకెళ్లనున్నాయి. అందుకోసం ఇప్పటికే అక్టోబర్ నెలలోనే 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని రెండు సంస్థలు ప్రకటించాయి. దీంతో ఈ నెలాఖరులోగా దేశంలో 5జీ కమర్షియల్ లాంచ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు టెలికం రంగ నిపుణలు.