మీరు కంప్యూటర్, మొబైల్ లో గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వాడుతున్నారా? అయితే.. మీ కంప్యూటర్ లేదా మొబైల్ లలో మీరే సైబర్ దాడులకు చాన్స్ ఇచ్చినట్టు అవుతుంది. అవును.. గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో ఉన్న చిన్న చిన్న లోపాలు సైబర్ దాడులకు అవకాశంగా మారుతోంది. ఈ విషయాన్ని కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(CERT-In) తెలిపింది. తాజాగా ఈ ఏజెన్సీ ఇచ్చిన నివేదిక ప్రకారం గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వాడే యూజర్ల సిస్టిమ్స్ను హ్యాకర్లు ఈజీగా హ్యాక్ చేయగలుగుతున్నారట. టార్గెట్ చేసుకొని మరీ అటాక్ చేస్తున్నారట. అటువంటి చాన్స్ సైబర్ హ్యాకర్స్ కు ఇవ్వకుండా ఉండాలంటే గూగుల్ క్రోమ్ బ్రౌజర్ను వెంటనే అప్డేట్ చేసుకోవాలని ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ సూచించింది. ఆర్బిట్రరీ కోడ్ను ఉపయోగించుకొని హ్యాకర్ గూగుల్ క్రోమ్ ద్వారా సిస్టమ్లోకి ప్రవేశిస్తున్నట్టు రెస్పాన్స్ టీమ్ వెల్లడించింది. క్రోమ్ 98 వర్షన్ బ్రౌజర్లో ఉన్న బగ్స్ను గూగుల్ ఇటీవలే ఫిక్స్ చేసింది.
గూగుల్ క్రోమ్ 98 వర్షన్ వెంటనే అప్డేట్ చేసుకోవాలి
గూగుల్ క్రోమ్ వర్షన్ 98.0.4758.80 కంటే ముందు వర్షన్ వాడుతున్న వాళ్లు మాత్రం వెంటనే అప్డేట్ చేసుకోవాలి. ఆ వర్షన్లలోనే బగ్స్ ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది. విండోస్తో పాటు మాక్ ఓఎస్, లైనక్స్ యూజర్లకు గూగుల్ క్రోమ్ 98 కొత్త అప్డేట్ వర్షన్ను ఫిక్స్ చేసింది. ఈ వర్షన్ లో కొత్తగా పలు సెక్యూరిటీ పీచర్లను జత చేసినట్లు పేర్కొంది.
ఎలా అప్డేట్ చేయాలంటే..
గూగుల్ క్రోమ్ అప్డేట్ను ముందే ఆటోమెటిక్గా పెట్టుకుంటే.. క్రోమ్ ఆటోమెటిక్గా అప్డేట్ అవుతుంది. ఒకవేళ ఆటోమెటిక్ అప్డేట్ ఎంచుకోని యూజర్లు.. గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి క్రోమ్ ఆప్షన్లోకి వెళ్లి.. About Google Chrome అనే ఆప్షన్ను క్లిక్ చేసి.. అప్డేట్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేటెస్ట్ వర్షన్ను వాడాలనుకుంటే.. డౌన్లోడ్ పూర్తయ్యాక.. బ్రౌజర్ను రీలాంచ్ చేయాల్సి ఉంటుంది.