శ్రీలంక స్టార్ స్పిన్నర్ వానిందు హసరంగా టెస్టు క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించాడు. 26 ఏళ్ళ ఈ స్టార్ స్పిన్నర్ పరిమిత ఓవర్ల క్రికెట్ మీదే దృష్టి పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు.
పరిమిత ఓవర్ల క్రికెట్ మోజులో పడి చాలా మంది టెస్టు క్రికెట్ కి దూరమవుతున్నారు. ప్రతిష్టాత్మకమైన టెస్టు క్రికెట్ ని నిర్లక్ష్యం చేస్తూ చాలా చిన్న వయసులోనే ఈ ఫార్మాట్ కి వీడ్కోలు పలకడం చాలా దురదృష్టకరం. ఒకానొక దశలో టెస్టు క్రికెట్ లో చోటు దక్కితే గగనంగా భావించే దగ్గర నుండి స్వయంగా వారే టెస్టు క్రికెట్ నుండి తప్పుకుంటూ తమ క్రికెట్ బోర్డు కి షాకిస్తున్నారు. తాజాగా శ్రీలంక పరిమిత ఓవర్ల టాప్ బౌలర్, ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ స్పిన్నర్ గా పేరు తెచ్చుకున్న వానిందు హసరంగా టెస్టు క్రికెట్ కి గుడ్ బై చెప్పేసాడు. పరిమిత ఓవర్ల క్రికెట్ ,మీద ఎక్కువగా దృష్టి పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. ఈ రోజు ( ఆగస్టు 15) హసరంగా టెస్టు క్రికెట్ కి రిటైర్మెంట్ అవుతున్నట్లుగా ప్రకటించాడు.
హసరంగా గురించి క్రికెట్ ప్రపంచానికి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మిస్టరీ స్పిన్నర్ గా అతి తక్కువ కాలంలోనే క్రికెట్ లో తన ముద్ర వేసాడు. వన్డే, టీ 20 ఫార్మాట్ లతో పాటు ప్రపంచ లీగ్ ల్లో సత్తా చాటాడు. 20 ఏళ్ళ వయసులో తొలిసారి జాతీయ జట్టులో స్థానం సంపాదించిన ఈ లెగ్ స్పిన్నర్ కి 2020 లో తొలిసారి దక్షిణాఫ్రికా సిరీస్ లో భాగంగా టెస్టు జట్టులో స్థానం లభించింది. అయితే వన్డే, టీ 20 ల్లో అదరగొట్టే హసరంగా.. టెస్టుల్లో మాత్రం ప్రభావం చూపించలేకపోయాడు. నాలుగు టెస్టుల్లో 7 ఇన్నింగ్స్ లు ఆడి కేవలం నాలుగు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. ఇక అప్పటి నుంచి హసరంగాకి టెస్టు జట్టులో చోటు దక్కడం లేదు.
ఇక అదే సమయంలో యువ స్పిన్నర్లు రమేష్ మెండీస్, ప్రభాత్ జయసూరియా అంచనాలకు మించి రాణించడంతో హసరంగా టెస్టు క్రికెట్ దారులు పూర్తిగా మూసుకుపోయాయి. 2021 లో బంగ్లాదేశ్ పై తన చివరి టెస్టు మ్యాచ్ ఆడేసిన 26 ఏళ్ళ హసరంగా.. ఇంత త్వరగా టెస్టు క్రికెట్ నుంచి తప్పుకుంటాడని బహుశా ఎవరూ ఊహించి ఉండరు. శ్రీలంక క్రికెట్ సీఈఓ డిసిల్వా.. హసరంగా నిర్ణయాన్ని మేము గౌరవిస్తున్నాం. అతడు మాకు వైట్ బాల్ క్రికెట్ లో చాలా కీలకం అని తెలియజేశాడు. మరి హసరంగా టెస్టు క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించడం మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.