రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో విరాట్ కోహ్లీది విడదీయలేని అనుబంధం. అతడు లేని ఆర్సీబీని ఊహించలేం కూడా.
ఇండియన్ ప్రీమియర్ లీగ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీది విడదీయరాని అనుబంధం. 2008లో ఐపీఎల్ మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా ఒకే ఫ్రాంచైజీకి ఆడుతున్న ఏకైక ప్లేయర్ కోహ్లీనే కావడం గమనార్హం. 2013 నుంచి 2021 సంవత్సరం వరకు వరుసగా 9 సీజన్లలో ఆర్సీబీకి అతడు కెప్టెన్గా వ్యవహరించాడు. ఒక్కసారి కూడా టైటిల్ నెగ్గకపోయినా ఫ్రాంచైజీ, బెంగళూరు ఫ్యాన్స్ హృదయాల్లో విరాట్కు ప్రత్యేక స్థానం ఉంది. ఆర్సీబీ పాపులారిటీ తగ్గకుండా చూసుకున్నాడతను. ఒకరకంగా విరాట్ అంటే ఆర్సీబీ, ఆర్సీబీ అంటే విరాట్ అనేంతలా ఫ్యాన్స్ గుండెల్లో చెరగని ముద్ర వేశాడు.
ఐపీఎల్లో కోహ్లీ లేకుండా బెంగళూరు జట్టును ఊహించుకోలేం. బెంగళూరుకు ఆడటంపై విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒక దశలో ఆర్సీబీని తాను వీడాలని అనుకున్నట్లు చెప్పాడు. టాపార్డర్లో ఆడే ఛాన్స్ లభించకపోవడమే దీనికి కారణమన్నాడు. ఐపీఎల్ మొదటి మూడు సీజన్లలో విరాట్ ఎక్కువగా 5, 6 స్థానాల్లో బ్యాటింగ్కు దిగేవాడు. దీంతో నిరుత్సాహానికి గురయ్యానని చెప్పాడు. ఐపీఎల్ జర్నీ అద్భుతంగా ఉందన్న కోహ్లీ.. బెంగళూరుతో భాగస్వామ్యం, ప్రయాణానికి తాను ఎంతో విలువను ఇస్తానని తెలిపాడు. తొలి మూడు సీజన్లలో ఫ్రాంచైజీ తనకు చాలా మద్దతుగా నిలిచిందని కోహ్లీ పేర్కొన్నాడు.
‘‘ఆర్సీబీ ఫ్రాంచైజీ నాకు ఎప్పుడూ మద్దతుగా నిలుస్తూ వచ్చింది. ప్లేయర్లను అట్టిపెట్టుకునే టైమ్ వచ్చినప్పుడు నన్ను కొనసాగించింది. టీమిండియా తరఫున మూడో స్థానంలో ఆడతాను కాబట్టి ఫ్రాంచైజీ తరఫున కూడా అదే పొజిషన్లో బ్యాటింగ్ చేస్తానంటే దానికి రే జెన్నింగ్స్ ఒప్పుకున్నారు. అవసరమైనప్పుడు నా మీద చాలా విశ్వాసం చూపించారు. అప్పుడు ఇంటర్నేషనల్ కెరీర్లో ఎదుగుతున్నా. టాపార్డర్లో ఆడే ఛాన్స్ కోసం మరో ఫ్రాంచైజీని సంప్రదించా. దాని పేరు చెప్పను. అయితే వాళ్లు నా మాట వినేందుకూ ఆసక్తి చూపలేదు. అయితే భారత్ తరఫున సత్తా చాటడంతో అదే ఫ్రాంచైజీ నా దగ్గరకు వచ్చి ‘దయచేసి మీరు వేలానికి అందుబాటులో ఉంటారా’ అని అడిగింది. ‘ఛాన్సే లేదు. నాకు సపోర్ట్గా నిలిచిన ఫ్రాంచైజీతోనే ఎప్పటికీ ఉంటా’ అని బదులిచ్చాను” అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.