మనిషి జీవితంలో పెళ్లి అనేది ఓ మర్చిపోలేని అనుభూతి. దాంతో ఈ తంతును అంగరంగ వైభవంగా చేసుకోవాలని అనుకుంటారు అందరు. అయితే కొన్ని రంగాలకు చెందిన వారికి హంగూ ఆర్భాటాలతో పెళ్లి చేసుకునేంత సమయం ఉండదు. దాంతో సాదాసీదాగా వివాహతంతును కానిస్తారు. ప్రస్తుతం ఇలానే తమ పెళ్లిని సాదాసీదాగా చేసుకున్నారు ముగ్గురు క్రికెటర్లు. ఇందులో విశేషం ఏముంది అనుకుంటున్నారా? వీరు ముగ్గురు ఒకే రోజు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. పైగా ఒకే దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆటగాళ్లు కూడా. వారే శ్రీలంక క్రికెటర్లు పాతుమ్ నిసాంక, చరిత్ అసలంక, కసున్ రజితలు. తీరిక లేకుండా షెడ్యూల్ ఉండటంతో ఈ యువ క్రికెటర్లు ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం శ్రీలంక-ఆఫ్ఘనిస్తాన్ ల మధ్య మూడు వన్డేల సిరీస్ నడుస్తోంది. తొలి వన్డేలో ఆతిథ్య లంక జట్టు ఘోర పరాభవాన్ని మూటకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక ఆదివారం జరిగిన రెండో వన్డే వర్షం కారణంగా రద్దు అయ్యింది. ఆ మరుసటి రోజే శ్రీలంక ఆటగాళ్లు నిసాంక, రజిత, అసలంక పెళ్లిపీటలెక్కారు. ఈ ముగ్గురు ప్లేయర్స్ తమ తమ గర్ల్ ఫ్రెండ్స్ ను వివాహం చేసుకున్నారు. షెడ్యూల్ బిజీగా ఉండటంతో వారు ఇలా ఒకే రోజు కొలంబోలో వేరు వేరు వేదికల్లో.. ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా పెళ్లి చేసుకున్నారు. శ్రీలంకలో ఉన్న ఆర్థిక సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకుని కొంత మంది అతిథుల సమక్షంలోనే వీరు పెళ్లి చేసుకున్నారు.
ఈ నేపథ్యంలోనే వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన క్రికెటర్లకు శ్రీలంక క్రికెట్ బోర్డు శుభాకాంక్షలు తెలిపింది. ప్రస్తుతం పాతుమ్ నిసాంక ఓపెనర్ గా శ్రీలంక జట్టుకు వెన్నముక్కగా నిలుస్తున్నాడు. అసలంక ఆల్ రౌండర్ గా రాణిస్తున్నాడు. కసున్ రజిత లంక పేస్ దళాన్ని ముందుండి నడిపిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఒకే రోజు ముగ్గురు క్రికెట్లరు పెళ్లి చేసుకోవడం చాలా అరుదైన సంఘటనగానే చెప్పుకోవాలని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ముగ్గురి జంటల ఫోటోలు మాత్రం నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఆఫ్ఘనిస్తాన్ తో బుధవారం ఆఖరి వన్డే జరగనుంది. ఈ మ్యాచ్ లో అయినా గెలిచి సిరీస్ ను సమం చేసి పరువు దక్కించుకోవాలని చూస్తోంది లంక.
Congratulations to Charith Asalanka, Pathum Nissanka and Kasun Rajitha! 💍🎉 pic.twitter.com/qlUZKtOMVG
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) November 28, 2022