సాధారణంగా క్రీడాకారులు అంటే.. సెలబ్రిటీ హోదా, లగ్జరీ కార్లు, ఖరీదైన ఇళ్లు, విలాసవంతమైన జీవితం. ఇదే ఓ సగటు క్రీడాభిమానితో పాటుగా సాధారణ జనాలు ఆలోచించే ఆటగాడి జీవన విధానం. కానీ అందరి ఆటగాళ్ల జీవన విధానం పూల పాన్పులా ఉంటుంది అనుకుంటే.. అది మన తప్పే అవుతుంది. ఇక ఓ ప్లేయర్ జాతీయ జట్టులో చోటు దక్కించుకునే క్రమంలో ఎన్నో కష్టాలు పడతాడు. కానీ జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నప్పటికీ, వరల్డ్ కప్ హాకీ జట్టులో సభ్యుడు అయినప్పటికీ అతడి పేదరికం, అతడి జీవితం మారలేదు. అతడే టీమిండియా స్టార్ హాకీ ప్లేయర్ నీలమ్ సంజీప్ జెస్. నేషనల్ ప్లేయర్ అయినప్పటికీ ఇప్పటికీ పెంకుటిల్లులోనే జీవిస్తున్నాడు. అతడి పేదరికం చూస్తే.. కళ్లలో నీళ్లు తిరగకమానవు. మరిన్ని వివరాల్లోకి వెళితే..
నీలమ్ సంజీప్ జెస్.. టీమిండియా స్టార్ హాకీ ప్లేయర్. ఒడిషాలోని సుందర్ ఘర్ జిల్లా కడోబహల్ అనే ఓ చిన్న పల్లెటూరు నుంచి వచ్చాడు. గత మూడేళ్లుగా జాతీయ హాకీ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు నీలమ్. జట్టులో స్టార్ డిఫెండర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నీలమ్. మరికొద్ది రోజుల్లో ఒడిషా వేదికగా ప్రారంభం కానున్న ప్రతిష్టాత్మకమైన వరల్డ్ కప్ జట్టులో నీలమ్ సభ్యుడు. అయితే ఇంతటి స్టార్ అయినప్పటికీ అతడి ఆర్థిక పరిస్థితి చూస్తే మాత్రం కన్నీళ్లు ఆగక మానవు. అంతర్జాతీయ ఆటగాడిగా ఎదిగినప్పటికీ.. సొంతంగా మాత్రం ఇళ్లు నిర్మించికోలేక పోయాడు. ఇప్పటికీ 40 సంవత్సరాల క్రితం తన తండ్రి నిర్మించిన పెంకుటింట్లోనే జీవిస్తున్నాడు. ఆ ఇంట్లో రెండు చిన్న గదలు మాత్రమే ఉన్నాయి. ఇక ఆ ఇంటికి గ్యాస్, నీటి కనెక్షన్లు కూడా లేవని సమాచారం.
అయితే ఎక్కువగా టోర్నీల్లో భాగంగా జట్టుతో కలిసి నగరాల్లో తిరిగే నీలమ్.. ఖాళీ సమయాల్లో వచ్చి తన పాత పెంకుటింట్లోనే ఉంటాడు. ప్రభుత్వం ఇప్పటికైనా తమకు ఇల్లు కేటాయించాలని నీలమ్ తండ్రి కోరుతున్నాడు. ఇంతటి కఠిన పరిస్థితులను సైతం తట్టుకుని, వరల్డ్ కప్ జట్టులో సభ్యునిగా ఎన్నికవ్వడం అంటే గొప్ప విషయమే. ఇలాంటి పరిస్థితులు ఆటగాడిని మనోవేదనకు గురిచేస్తాయి. తద్వారా అది అతడి ఆటపై ప్రభావం చూపి.. చివరికి జట్టు ఓటమికి కూడా కారణం అయ్యే ప్రమాదం లేకపోలేదు అని అంటున్నారు క్రీడా నిపుణులు. ఇలాంటి పరిస్థితుల నుంచి వారిని బయటపడేస్తేనే జట్టు వారి నుంచి మంచి ప్రదర్శన రాబట్టగలదు. ఇప్పటికైనా రాష్ట్ర, కేంద్రప్రభుత్వాలు ఇలాంటి ఆటగాళ్లపై దృష్టి సారించాలని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.