వరుసగా రెండుసార్లు ఒలింపిక్ మెడల్ విజేత, భారత స్టార్ షట్ట్లర్ పి.వి. సింధు కుటుంబసభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. స్వామి వారి ఆశీస్సులు పొందడం ఆనందంగా ఉందన్నారు. సింధుకు వేదపండితులు తీర్థప్రసాదాలు, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.
స్వామివారిని దర్శించుకున్న అనంతరం మాట్లాడుతూ సరైన తోడ్పాటులేక ఎంతో మంది యువత క్రీడల్లో వెనుకపడిపోయారని సింధు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో విశాఖలో అతిత్వరలో బ్యాడ్మింటన్ ట్రైనింగ్ అకాడమీ ప్రారంభించనున్నట్లు సింధు తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న యువ ఆటగాళ్లను ప్రోత్సహించేందుకే అకాడమీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. 2016 రియో ఒలింపిక్స్లో రజతం, 2020 టోక్యో ఒలింపిక్స్లో కాంస్యంతో అదరగొట్టిన సింధు.. రానున్న టోర్నమెంట్లు, 2024 ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించేందుకు కృషి చేస్తానన్నారు.