క్రీడా ప్రపంచంలో కొన్ని సాంప్రదాయాలు అనాదిగా వస్తూఉంటాయి. కొంత మంది ఆటగాళ్లు మాత్రమే మరి కొన్ని నూతన సాంప్రదాయాలను సృష్టిస్తారు. ఈ క్రమంలో గతంలో ఇండియా సారథులు గంగూలీ, ధోనీలు ఓ కొత్త ఒరవడికి శ్రీకారం చూట్టారు. తాజాగా దాన్ని ధావన్ సైతం అనుసరించాడు. మరి ఆ కొత్త ఒరవడి ఏంటీ? ధావన్ చేసిన పనేంటి? అనే వివరాల్లోకి వెళితే..
ప్రస్తుతం టీంఇండియా విండీస్ టూర్ లో ఉంది. తాజాగా జరిగిన మూడో వన్డేలో కూడా భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. వర్షం అడ్డంకిగా మారడంతో డక్ వర్త లూయిస్ పద్దతి ప్రకారం భారత్ గెలిచింది. దీంతో మూడు వన్డేల సిరీస్ టీంఇండియా క్లీన్ స్వీప్ చేసింది. మ్యాచ్ అనంతరం ట్రోఫీ ప్రధానోత్సవంలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది.
శిఖర్ ధావన్.. ‘గబ్బర్’ అని అభిమానులు ముద్దుగా పిలుచుకుంటారు. దానికి తగ్గట్టుగానే ధావన్ సైతం మైదానంలో క్యాచ్ లు పట్టగానే తన హావభావాలతో ప్రేక్షకులను మురిపిస్తాడు. అతను తోడ కొడితే.. అభిమానులు కేరింతలు కొడతారు. అయితే తాజాగా జరిగిన ట్రోఫీ ప్రధానోత్సవంలో ధావన్ కప్ అందుకోగానే దాన్ని యువ ఆటగాడు అయిన ఆవేశ్ ఖాన్ కు దాన్ని అప్పగించాడు. దాంతో ఆవేశ్ ఖాన్ నవ్వులు చిందించాడు.
సాధారణంగా గతంలో ధోనీ ఇలా చేసేవాడు. అలా జట్టులోని యువ ఆటగాళ్లకు కప్ ఇవ్వడం ద్వారా వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపోచ్చన్నది వారి ఆలోచన. ఈ దృశ్యం చూసిన ప్రేక్షకులు ధావన్ మిస్టర్ కూల్ వారసత్వాన్ని కొనసాగించాడని కొనియాడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మరి ధావన్ యువ ఆటగాళ్లపై చూపించిన ప్రేమపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.