సచిన్ టెండూల్కర్.. ఇండియాలో క్రికెట్ ఉన్నంత కాలం వినిపిస్తూనే ఉండే పేరు. ఇండియాలోనే కాదు ప్రపంచంలో ఏ మూలన క్రికెట్ ఆడినా, క్రికెట్ గురించి మాట్లాడినా సచిన్ పేరు స్మరించుకోవాల్సిందే. అంతలా సచిన్ తన ముద్రను ప్రపంచ క్రికెట్పై వేశాడు. సచిన్ ఆట గురించి ఎంత చెప్పినా, ఎంత పొగిడినా తక్కువే అవుతుంది. సచిన్ ఆడిన కొన్ని షాట్ల గురించి మాట్లాడుకోవడానికి కొన్ని గంటలు, అతను గెలిపించిన మ్యాచ్ల గురించి చెప్పుకోవడానికి కొన్ని రోజులు పడుతుంది. అలాంటి అద్భుతమైన మ్యాచ్ల్లో భారత్-ఆస్ట్రేలియా మధ్య 1998లో షార్జా వేదికగా జరిగిన కోకాకోలా కప్ ఫైనల్ మ్యాచ్ కూడా ఒకటి. నిజానికి సచిన్ ఇండియన్ క్రికెట్ గాడ్గా అవతారం ఎత్తి.. తన బ్యాటింగ్తో ఆస్ట్రేలియాపై శివతాండవం చేసి.. భారత క్రికెట్ అభిమానులకు తన విశ్వరూప దర్శనం భాగ్యం కల్పించిన మ్యాచ్ అది.
భారత్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా మధ్య షార్జా వేదికగా 1998 ఏప్రిల్ 17 నుంచి 24 వరకు ముక్కోణపు టోర్నీ జరిగింది. ప్రతి జట్టు మిగతా రెండు జట్లతో రెండేసి మ్యాచ్లు ఆడాలి. అప్పటికే టీమిండియా న్యూజిలాండ్పై ఒక మ్యాచ్ గెలిచి ఒకటి ఓడి ఆసీస్ చేతిలో ఒక మ్యాచ్లో ఓడి ఉంటుంది. కివీస్ టీమిండియాపై ఒక మ్యాచ్లో ఓడి.. ఒక మ్యాచ్లో గెలిచి ఆసీస్పై రెండు మ్యాచ్ల్లోనూ ఓడి దాదాపు ఇంటికి వెళ్లిపోయింది. భారత్-ఆస్ట్రేలియా మధ్య చివరి లీగ్ మ్యాచ్లో టీమిండియా గెలిస్తే ఫైనల్ వెళ్లి, మళ్లీ ఆసీస్తోనే ఫైనల్ ఆడాలి. ఒక వేళ భారీ తేడాతో ఓడితే కివీస్ ఫైనల్ వెళ్లే అవకాశాలు ఉన్నాయి. కానీ.. టీమిండియా ఆసీస్తో మ్యాచ్లో ఓడినా.. మెరుగైన రన్రేట్తో ఫైనల్ చేరింది. ఫైనల్కు ముందు ఎంతో కీలకమైన ఈ మ్యాచ్లోనూ సచిన్ 143 పరుగులతో ఆసీస్ బౌలర్ల భరతం పడతాడు. కానీ.. టీమిండియా ఓడిపోతుంది. ఒక రోజు గ్యాప్ తర్వాత భారత్-ఆసీస్ మధ్య ఫైనల్ మ్యాచ్ మొదలైంది.
తొలుత ఆస్ట్రేలియా బ్యాటింగ్కు దిగి నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 272 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఆ టోర్నీలో అప్పటి వరకు ఆస్ట్రేలియాతో జరిగిన రెండు మ్యాచ్ల్లోనూ టీమిండియా ఓడిపోయి ఉంది. ఫైనల్లో గెలుస్తుందన్న నమ్మకం కూడా లేదు. ఉన్న ఒకే ఒక హోప్ సచిన్ టెండూల్కర్. జట్టు మొత్తం సచిన్పైనే భారం వేసి ఫైనల్ల్లో బ్యాటింగ్ దిగింది. సచిన్తో పాటు ఓపెనర్గా కుర్రాడు సౌరవ్ గంగూలీ వచ్చాడు. 28 పరుగులు చేసి అతను అవుటైన తర్వాత కొద్ది సేపటికే మరో వికెట్. అయినా సచిన్ తన దండయాత్ర కొనసాగించాడు. ఫైనల్కు ముందు లీగ్ మ్యాచ్ ఆడిన షాట్లే మళ్లీ చూపిస్తూ.. ఆ మ్యాచ్కు హైలెట్స్ చూపిస్తున్నారా? అనేలా బ్యాటింగ్ చేశాడు. ఆసీస్ దిగ్గజ బౌలర్లు షేన్ వార్న్, ఫ్లెమ్మింగ్, స్టీవా, టామ్ మూడీ లాంటి హేమాహేమీల తుక్కురెగ్గొడుతూ.. సచిన్ రెచ్చిపోయాడు.
సచిన్ కొట్టుడు ముందు ఆసీస్ బౌలర్లు తేలిపోయారు. ప్రపంచ క్రికెట్ను వణికిస్తున్న ఆసీస్ బౌలింగ్ దళంపై సచిన్ ఒక్కడే ఎదురుదాడి చేస్తున్న రోజులవి. కళ్లు చెదిరే కవర్ డ్రైవ్లు, వావ్ అనిపించే చీకీ షాట్లు, వామ్మో అనిపించే లాఫ్టెడ్ షాట్లతో ఎడాది దేశంలో సచిన్ పరుగుల వరద పారించాడు. సచిన్ బ్యాటింగ్తో షార్జా స్టేడియం హోరెత్తిపోయింది. ఆసీస్ బౌలర్లు బిత్తరపోయారు. సచిన్కు అప్పటి టీమిండియా కెప్టెన్ మొహమ్మద్ అజహరుద్దీన్ కూడా హాఫ్ సెంచరీతో అండగా నిలవడంతో.. ఈసారి సచిన్ ఇండియాను గెలిపించాడు. ప్రపంచ క్రీడాభిమానులను ఆశ్యర్యంలో ముంచెత్తుతూ.. టీమిండియా కోకాకోలా కప్ ఫైనల్లో ఆస్ట్రేలియాను మట్టికరిపిస్తుంది. 131 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సులతో సచిన్ టెండూల్కర్ 134 పరుగులు చేసి.. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా నిలుస్తాడు. 272 పరుగుల లక్ష్యఛేదనలో సచిన్ ఒక్కడే 134 కొట్టేశాడు.
ఈ విజయంతో షార్జా స్టేడియం భారీ సంబురాలకు వేదికైంది. మ్యాచ్ ముగిసినా ఇండియన్ ఫ్యాన్స్ స్టేడియం విడిచిపోలేదు. టీమిండియా సాధించిన అద్భుత విజయాన్ని మరింత ఆస్వాదించేందుకు, సచిన్ సృష్టించిన సునామీలో ఇంకా తడిసి ముద్ద అవ్వాలని అక్కడే ఉండిపోయారు. అవార్డుల ప్రజెంటేషన్ తర్వాత.. మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా నిలిచిన సచిన్కు కారు బహుమతిగా దక్కింది. మొదట సచిన్ వెళ్లి డ్రైవింగ్ స్కూల్లో కూర్చోని.. తర్వాత టీమ్ మొత్తాన్ని ఆహ్వానించాడు. జట్టు సభ్యులందరూ కారు లోపలా, బయటా అతుక్కుపోతారు. గ్రౌండ్ చుట్టూ రౌండ్స్ వేసి.. అభిమానులతో ఆ విజయానందాన్ని పంచుకునే దృశ్యాలు ఇప్పటికీ క్రికెట్ అభిమానులకు ఎంతో ప్రత్యేకం. ఆ మ్యాచ్లో సచిన్ బ్యాటింగ్, మ్యాచ్ తర్వాత కారు సంబురాలు ఇండియన్ క్రికెట్ అభిమాల గుండెల్లో చెరగని జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి. సచిన్ను అప్పటి నుంచే అందరూ క్రికెట్ దేవుడిగా కీర్తించడం, ఆరాధించడం మొదలుపెట్టారు. అంతటి ప్రత్యేకమైన మ్యాచ్ తాలుకూ మధుర క్షణాలను నేటి తరం అభిమానులకు తెలిపేందుకే ఈ ప్రత్యేక కథనం. మరి షార్జాలో ఆస్ట్రేలియాపై టీమిండియా ఘన విజయం, ఆ మ్యాచ్లో సచిన్ ఆడిన ఇన్నింగ్స్పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: ఊతప్ప నిస్వార్థమే ‘రోహిత్ 264’ ఇన్నింగ్స్కు కారణం!