మారుతున్న కాలానికి అనుగుణంగా మనమూ మారాలి. అలా మారినప్పుడే మనం ముందుకు పోగలం. ఇక కొత్తగా పుట్టుకొస్తున్న ప్రతీ వ్యవస్థ పాత వ్యవస్థ పతనానికే దారి తీస్తుంది. ఈ వ్యాఖ్యలు వన్డే క్రికెట్ కు అక్షరాల సరిపోతాయి. ఇప్పటి వరకు ఘనమైన కీర్తిని సొంతం చేసుకుని ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న వన్డే క్రికెట్ కు.. రానున్న రోజుల్లో కాలం చెల్లబోతోంది అంటున్నాడు టీమిండియా మాజీ ఆటగాడు రాబిన్ ఊతప్ప. టీ20, టీ10ల కాలంలో వన్డేలకు 7 గంటలు టైమ్ కేటాయించడాకి జనాలు ఆసక్తి చూపించరని ఊతప్ప చెప్పుకొచ్చాడు. అయితే సంప్రదాయ క్రికెట్ అయిన టెస్ట్ క్రికెట్ కు మాత్రం ఆదరణ తగ్గదు అని పేర్కొనడం గమనార్హం.
ఫుట్ బాల్ గేమ్ లో ఉన్న ఫ్రాంఛైజీల విధానం మెల్లగా క్రికెట్ కు కూడా పాకింది. దాంతో సంప్రదాయ క్రికెట్ అయిన టెస్టులు, వన్డేల భవిష్యత్ ఆందోళనలో పడింది. ఇదే విషయంపై తాజాగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు టీమిండియా మాజీ బ్యాటర్ రాబిన్ ఊతప్ప. ప్రస్తుతం యూఏఈ వేదికగా జరుగుతున్న ILT20 లీగ్ లో దుబాయ్ క్యాపిటల్స్(డీసీ) జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు ఉతప్ప. తాజాగా జరిగిన మ్యాచ్ లో తన బ్యాటింగ్ తో దుమ్మురేపాడు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లడుతూ..”ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ లో ఎన్నో లీగ్ లు పుట్టుకొచ్చాయి. గతంలో ఈ సంప్రదాయం సాకర్ లో మాత్రమే ఉండేది. ఇది క్రమేనా క్రికెట్ కు కూడా వ్యాపించింది. ఈ నేపథ్యంలోనే ప్రేక్షకులు వన్డేలను చూసేందుకు ఆసక్తి చూపించరు. 6,7 గంటలు మ్యాచ్ చూసేందుకు వారికి విసుగు వచ్చిందని తెలుస్తోంది. ప్రస్తుతం జనాలు టీ20, టీ10ల మీదే ఆసక్తి కనబరుస్తున్నారు. రానున్న రోజుల్లో టీ10 లీగ్ లు క్రికెట్ ను శాసిస్తాయి” అని రాబిన్ ఊతప్ప చెప్పుకొచ్చాడు.
అయితే టీ20, టీ10లు వచ్చినప్పటికీ టెస్ట్ క్రికెట్ కు మాత్రం ఆదరణ తగ్గదు అని ఊతప్ప పేర్కొనడం విశేషం. ఇక అసోషియేటెడ్ దేశాలకు టీ10 ఫార్మాట్ బాగా ఉపయోగపడుతుందని రాబిన్ అన్నాడు. ప్రస్తుతం క్రికెట్ కూడా అన్ని రంగాల్లాగే స్పీడ్ గా మారుతోందని, దానికి తగ్గట్లుగానే మనమూ మారాలని సూచించాడు. ఇకపోతే ప్రేక్షకులు ఏ ఫార్మాట్ ఎక్కువగా చూడటానికి ఆసక్తి చూపిస్తారో అదే ఫార్మాట్ ను ఆటగాళ్లు ఆడాలి అని పేర్కొన్నాడు. అందుకే రాబోయే రోజుల్లో వన్డేలకు కాలం చెల్లుతుందని షాకింగ్ కామెంట్స్ చేశాడు. మరి రాబిన్ ఊతప్ప చేసిన ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.