ఎన్నో అంచనాల నడుమ మైదానంలోకి అడుగుపెట్టి పాక్ చేతిలో ఓటమిపాలైన టీమిండియాకి అందరూ మోరల్ సపోర్ట్ ఇస్తున్నారు. కానీ, అసలు అంత దారుణంగా ఎలా జరిగింది అన్నదే ప్రశ్న. పాకిస్తాన్ కచ్చితంగా చాలా మంచి ప్రదర్శన చేసింది అనడంలో సందేహం లేదు. వాళ్లు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నారు అన్న విషయం న్యూజిలాండ్పై విజయం కూడా చెప్తోంది. ఇప్పుడు వినిపిస్తున్న విమర్శ టీమిండియా టీమ్ సెలక్షన్ గురించే. మెంటర్ ధోనీ ఎంట్రీ ఇవ్వగానే అందరిలో ఆత్మవిశ్వాసం రెట్టింపైంది. కానీ మైదానంలో ప్రదర్శన చూశాక అసలు టీమిండియా సెమీస్ కు చేరుతుందా అని అభిమానుల్లో అనుమానం కనిపిస్తోంది. అసలు టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ లో ఏం జరుగుతోంది అన్నదే అందరి ప్రశ్న.
మెంటర్ గా ధోనీ ఛార్జ్ తీసుకోగానే ఎన్నో వ్యూహాలు, మరెన్నో ప్రణాళికలు టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ లో కనిపిస్తాయనుకున్నారు. ప్రదర్శన, వ్యూహాలను చూసి అంతా సర్వసాధారణంగా ఉందని భావిస్తున్నారు. అసలు కోహ్లీ.. ధోనీ మాట వింటున్నాడా? వినకపోవడం వల్లే ఇలా జరుగుతోందా? అని ప్రశ్నిస్తున్నారు. అసలు మెంటర్గా ధోనీ పని మొదలు పెట్టాడా? అని కూడా ప్రశ్నిస్తున్నారు.
టీమ్ సెలక్షన్ పైనే ఇప్పుడు అన్నీ విమర్శలు. సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో మిస్టరీ బౌలర్ వరుణ్ చక్రవర్తిని తీసుకొచ్చారు. వరుణ్ చక్రవర్తి ప్రభావం చూపకపోగా పరుగులు వరద సాగింది. మరోవైపు బ్యాటింగ్ కు కూడా సహకరించే శార్దూల్ ఠాకూర్ ను కాదని ఫామ్ లో లేని భువనేశ్వర్ కుమార్ ను తీసుకున్నారు. ధోనీ మెంటర్ కాగానే స్టాండ్ బై నుంచి మెయిన్ 15లోకి వచ్చాడు శార్దూల్ ఠాకూర్. కానీ, ప్లేయింగ్ 11లో చోటు దక్కలేదు అంటే అక్కడ ధోనీ మాట నెగ్గడం లేదనే అభిమానులు భావిస్తున్నారు. ధోనీ- రవిశాస్త్రి- కోహ్లీ మధ్య నిజంగానే సఖ్యత కుదరట్లేదు అనే భావనకు వచ్చేలా ఉంది వాతావరణం.