నో బాల్స్ వేయడం ఎంత పెద్ద తప్పో.. గురువారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో టీమిండియాకు తెలిసొచ్చి ఉంటుంది. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 7 నో బాల్స్ వేశారు భారత బౌలర్లు. ఈ నో బాల్స్.. వాటితో వచ్చిన ఫ్రీ హిట్లే భారత ఓటమిని శాసించాయి. భారీ లక్ష్యం ఛేదించే క్రమంలో టాపార్డర్ పూర్తిగా విఫలమైనా.. అక్షర్ పటేట్, సూర్యకుమార్ యాదవ్, శివమ్ మావీ వీరోచితంగా పోరాడినా.. ఆ నో బాల్స్తో వచ్చిన భారీ తేడాను పూడ్చలేకపోయారు. దీంతో టీమిండియా విజయానికి 16 పరుగుల దూరంలో నిలిచి ఓడింది. పుణే వేదికగా గురువారం జరిగిన రెండో టీ20లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ హార్ధిక్ పాండ్యా.. తొలుత శ్రీలంకను బ్యాటింగ్కు ఆహ్వానించాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన లంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 206 పరుగుల భారీ స్కోర్ చేసింది.
లంక కెప్టెన్ డసన్ షనక 22 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్స్లతో 56(నాటౌట్) పరుగులతో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి.. లంకకు భారీ స్కోర్ అందించాడు. అలాగే ఓపెనర్లు కుశాల్ మెండీస్(52), పాతుమ్ నిస్సంకా(33) లంకు మంచి ఆరంభాన్ని అందించారు. ఇక టీమిండియా బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ 3, అక్షర్ పటేల్ 2, యుజ్వేంద్ర చాహల్ ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్యఛేదనకు దిగిన టీమిండియా.. ఆరంభంలోనే వరుసగా వికెట్లు కోల్పోయింది. ఇషాన్ కిషన్ 2, శుబ్మన్ గిల్ 5, రాహుల్ త్రిపాఠి 5, హార్దిక్ పాండ్యా 12, దీపక్ హుడా 9.. ఇలా పెవిలియన్కు క్యూ కట్టారు. దీంతో భారత్ 57 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
ఇక్కడి నుంచి అక్షర్ పటేల్ 31 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స్లతో 65 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ 36 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 51 రన్స్తో పోరాడినా.. అప్పటికే చాలా ఆలస్యమైపోయింది. కావాల్సిన రన్రేట్ భారీగా పెరిగిపోయింది. దాన్ని అందుకునే క్రమంలో భారీ షాట్కు వెళ్లి సూర్య అవుట్ అయ్యాడు. చివర్లో శివమ్ మావీ సైతం 15 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 26 పరుగులు చేసి ఆశలు రేకెత్తించినా.. గమ్యం చేరుకోలేదు. దీంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 190 పరుగులు మాత్రమే చేసి.. 16 రన్స్ తేడాతో ఓడింది. అయితే.. ఈ ఓటమిలో టీమిండియాను దారుణంగా దెబ్బ కొట్టింది నో బాల్స్.. ఈ మ్యాచ్లో భారత బౌలర్లు ఏకంగా 7 నో బాల్స్ వేయడం గమనార్హం. ఈ నో బాల్స్ వల్ల ఫ్రీ హిట్రూపంలో మొత్తంగా శ్రీలంక 36 పరుగులు రాబట్టుకుంది.
అదే శ్రీలంక బౌలింగ్ సమయంలో వాళ్లు ఒక్క నో బాల్ కూడా వేయలేదు. ఇదే భారత్ ఓటమిని శాసించింది. ఆ 7 నో బాల్స్లో అర్ష్దీప్ సింగ్ ఒక్కడే 5 వేశాడు. తను వేసిన తొలి ఓవర్లోనే వరుసుగా 3 నో బాల్స్ వేశాడు. ఆ నో బాల్స్కు ఏకంగా 13 రన్స్ వచ్చాయి. ఒక్క బాల్ కూడా కౌంట్ కాకుండా లంకకు 13 రన్స్ వచ్చాయి. అయితే.. అర్షదీప్ సింగ్ కావాలనే నో బాల్స్ వేసి.. ఫిక్సింగ్కు పాల్పడ్డాడంటూ.. కొంతమంది క్రికెట్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు చేస్తున్నారు. ఏది ఏమైనా.. మూడు టీ20ల సిరీస్లో ప్రస్తుతం భారత్-శ్రీలంక 1-1తో సమంగా నిలిచాయి.. దీంతో 7న శనివారం జరగనున్న చివరి మ్యాచ్తో సిరీస్ ఎవరి సొంతం అవుతుందో తేలిపోనుంది. మరి ఈ మ్యాచ్లో భారత బౌలర్లు వేసిన నో బాల్స్పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
5 No-Balls by Arshdeep Singh #INDvSL pic.twitter.com/BTSQAgiaBw
— RVCJ Media (@RVCJ_FB) January 5, 2023